నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..కేంద్రం ప్రకటనతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్నిచ్చే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం ప్రకటించారు. గోవాలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీట్లో కార్పొరేట్ ట్యాక్స్ను 25 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. అంతేకాకుండా తయారీ రంగ, స్థానిక కంపెనీలను ప్రోత్సహించే బాటలో ఈ ఏడాది అక్టోబర్ నుంచీ ఏర్పాటయ్యే తయారీ రంగ కంపెనీలు 15 శాతమే కార్పొరేట్ పన్నును చెల్లించవచ్చంటూ సీతారామన్ పేర్కొన్నారు.
నిర్మలా సీతారామన్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. గత కొద్దిరోజులుగా నేలచూపులు చూసిన మార్కెట్లు ఆర్థికమంత్రి నిర్ణయంతో ఆకాశానికంటాయి. ఒకానొక సమయంలో ఏకంగా 14 వందల 45 పాయింట్ల లాభంతో ట్రేడయ్యింది. అలాగే నిఫ్టీ సైతం 343 పాయింట్లు జంప్చేసింది. బ్యాంకింగ్, ఆటో, మెటల్, ఫార్మా రంగాల షేర్లు.. 2 నుంచి 6 శాతం మధ్య పైకి ఎగబాకాయి.