జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా శివారు బిజ్ బెహరా ప్రాంతంలో ఓ ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు నక్కారన్న విషయం తెలుసుకున్న జవాన్లు, సీఆర్పీఎఫ్ తో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. తొలుత భద్రతా బలగాలకు ఎదురుపడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జవాన్ల ఎదురుకాల్పులను తప్పించుకునే క్రమంలో టెర్రరిస్టులు ఓ ఇంట్లో నక్కారు.
మొత్తం నలుగురు ఉగ్రవాదులు ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్న భద్రతాబలగాలు ఎదురుకాల్పులు చేపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను తాత్కాలింకంగా నిలిపేశారు. నివాస ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
నిన్న గాందర్బల్ అడవుల్లో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేయగా పాక్ సైనికులు కూడా విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయా చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే సరిహద్దు వెలుపల 500 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఉగ్రదాడులు భారీగా జరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.