మనీలాండరింగ్ దర్యాప్తునకు సంబంధించి యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ముంబైలోని ఏజెన్సీ బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయంలో ఈడీ రెండవ రోజు విచారన అనంతరం రానా కపూర్ను అరెస్టు చేశారు. కపూర్ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) నిబంధన ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి కేంద్ర ఏజెన్సీ తన నివాసం, ఆఫీసులపై దాడి చేయడం తోపాటు రానాను 20 గంటలకు పైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. కస్టడీ కోసం ఆయనను స్థానిక కోర్టుకు హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద అతని స్టేట్మెంటును ఏజెన్సీ నమోదు చేసింది.
మరింత సమాచారం మరియు ఆధారాలు సేకరించడానికి కపూర్ ముగ్గురు కుమార్తెలకు చెందిన ఇళ్ళు, కార్యాలయాలను శనివారం శోధించారు. శుక్రవారం రాత్రి వోర్లి ప్రాంతంలోని 'సముద్రా మహల్' భవనంలోని రానా నివాసంలో ఈడీ శోధించి, అతన్ని అక్కడ కూడా ప్రశ్నించారు.
కపూర్పై ఉన్న కేసు స్కామ్.. దెబ్బతిన్న దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డిహెచ్ఎఫ్ఎల్) తో ముడిపడి ఉంది, బ్యాంకు ఈ సంస్థకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మార్చాయని ఈడీ అధికారులు ఆరోపించారు. ప్రస్తుతం యస్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం రానా కపూర్ అని ఈడీ అధికారులు భావిస్తున్నారు. డిహెచ్ఎఫ్ఎల్ లోని ఒక సంస్థకు పొడిగించిన 600 కోట్ల రూపాయల రుణం కూడా ఈడీ దర్యాప్తు పరిధిలో ఉందని వారు తెలిపారు. మరోవైపు యస్ బ్యాంకు నుంచి విత్ డ్రా పై రిజర్వ్ బ్యాంక్ మారిటోరియం విధించిన సంగతి తెలిసిందే.
రూ.50 వేల వరకు తీసుకోవచ్చని తెలుపడంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. యస్ బ్యాంక్ సహా ఇతర ఏటీఎంలలో కూడా నగదు విత్ డ్రా చేసుకోవచ్చని బ్యాంక్ ట్వీట్ చేసింది. యస్ బ్యాంక్ సంక్షోభం తర్వాత నగదు తీసుకొనేందుకు ఖాతాదారులు ఇబ్బంది పడ్డ విషయం అందరికి తెలిసిందే.