Earth Quake: భూ ప్రకంపనలతో ఉలిక్కిపడిన నేపాల్.వణికిన ఢిల్లీ పరిసరాలు.!
* ఇళ్లలోంచి ప్రాణభయంతో పరుగులు తీసిన జనం
భూ ప్రకంపనలతో ఉలిక్కిపడిన నేపాల్.వణికిన ఢిల్లీ పరిసరాలు
బుధవారం తెల్లవారుజామున భూప్రకంపనలు నేపాల్, ఢిల్లీ పరిసర ప్రాంతాలను వణికించాయి. నేపాల్ దేశంతోపాటు ఢిల్లీ, ఎన్సీఆర్, పిథోరాఘడ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వేకువ జామున రెండు గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వణికిస్తున్న చలిలో తెల్లవారుజామున సంభవించిన భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న ఢిల్లీ ఉలిక్కిపడింది. ఇళ్లలో నుంచి జనం ప్రాణభయంతో పరుగులు తీశారు.
నేపాల్ కేంద్రంగా సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. నేపాల్ దేశంలో మంగళవారం రాత్రి కూడా రెండు సార్లు భూమి కంపించింది. గడచిన 12 గంటల్లో నేపాల్ దేశంలో మూడు సార్లు భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. నేపాల్ దేశంలో మంగళవారం రాత్రి 8.52 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. తర్వాత మంగళవారం రాత్రి 9.41 గంటలకు 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూప్రకంపనలతో పరుగులు తీసిన ప్రజలు
బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు 6.3 తీవ్రతతో మూడోసారి భూకంపం సంభవించింది. మూడోసారి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి.యూపీలోని మొరాదాబాద్లోని ఒక కార్యాలయంలో భూకంపం తీవ్రత సీసీటీవీ ఫుటేజ్ లో నమోదైంది. కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లోని పలువురు ప్రజలు సోషల్ మీడియా తమ అనుభవాలను ఏకరవు పెట్టారు. గాఢనిద్రలో ఉన్న ప్రజలు భూప్రకంపనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.