Corona virus : స్ర్కీన్ గార్డులపై కరోనా వైరస్ ఎక్కువ కాలం
స్మార్ట్ఫోన్ స్ర్కీన్ గార్డులపై కొవిడ్ వైరస్ ఎక్కువ కాలం జీవించే అవకాశముందని ఐఐటీ (హైదరాబాద్) పరిశోధకులు తెలిపారు
స్మార్ట్ఫోన్ వినియోగం విషయంలో నేటి యువత సరికొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. వారు వాడుతున్నది లేటెస్ట్ ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోనే అయినా మార్కెట్లోకి మరో కొత్త మోడల్ వచ్చిందంటే చాలు, పాత మొబైల్ను ఎంతో కొంతకు వదిలించేసుకుని కొత్త ఫోన్ కోసం పరుగులు పెట్టేస్తున్నారు. అదే స్మార్ట్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు హైదరాబాద్ ఐఐటి పరిశోధకలు. అదేంటో చూద్దాం..
సాధారణ అద్దాలతో పోల్చితే స్మార్ట్ఫోన్ స్ర్కీన్ గార్డుల మీద కొవిడ్ వైరస్ ఎక్కువ కాలం జీవించడానికి అవకాశముందని ఐఐటీ (హైదరాబాద్) పరిశోధకులు గుర్తించారు. స్ర్కీన్, స్ర్కీన్ గార్డులలో నీటిని పీల్చుకునే గుణం ఉండకపోవడమే దీనికి కారణమని వారు స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా విజృంబిస్తున్న తరుణంలో వీరి పరిశోధనాంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కరోనా బారిన పడిన వ్యక్తి నుంచి వచ్చే తుంపర్లు భిన్న వాతావరణ పరిస్థితుల్లో ఎంతసేపు ఎండిపోకుండా ఉంటాయనే అంశమై వీరు పరిశోధనలు చేశారు. వీరి పరిశోధనల్లో తుంపర్లు ఎండిపోతే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలావరకు తక్కువగా ఉంటాయని గుర్తించారు. ''నీటి బిందువులతో పోల్చితే వ్యక్తి నుంచి వెలువడే తుంపర్లలో ఉప్పు, ప్రోటీన్ (మ్యూకస్), కొంత మేర నీరు కలిసి ఉంటాయి. దీనివల్ల కూడా తుంపర్లు ఆవిరవడానికి, ఎండిపోయేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది.
ఒక నానోలీటర్ తుంపర జీవితకాలం ఒక్క నిమిషం మాత్రమే. అదే 10 నానోలీటర్ల తుంపర ఆవిరవ్వడానికి 15 నిమిషాలు పడుతుంది. కానీ గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ తేమ ఉంటే ఆ సమయం గంటకు పైగా ఉంటుంది'' అని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఆచార్య కీర్తీచంద్ర సాహు వివరించారు. ఎండిపోయిన తుంపర్లలోనూ కొన్నిసార్లు వైరస్ బతికే ఉంటోందని, దానికి కారణాలను తెలుసుకోవడానికి మరింత పరిశోధన జరగాలన్నారు. ఆయనతో పాటు డాక్టర్ శరవణన్ బాలుస్వామి, డాక్టర్ సాయక్ బెనర్జీ ఇందులో భాగస్వాములయ్యారు.