Heavy Rains: కేరళను అతలాకుతులం చేస్తున్న భారీ వర్షాలు

*కొట్టాయం, ఇడుక్కి జిల్లాలలో విరిగిపడ్డ కొండచరియలు *కొట్టాయం జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన రెండంతస్తుల బిల్డింగ్

Update: 2021-10-19 04:20 GMT

కేరళను అతలాకుతులం చేస్తున్న భారీ వర్షాలు(ఫైల్ ఫోటో) 

Heavy Rains: కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శబరిమల పుణ్యక్షేత్రం, అయ్యప్ప జన్మస్థలమైన పందళం, అచ్చన్‌కోవిల్‌ వంటి ముఖ్యమైన సందర్శక ప్రదేశాలున్న పతనంతిట్ట జిల్లాతోపాటు దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ఇడుక్కి జిల్లా, అటు తమిళనాడులోని త్రిషూర్‌ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది.

పంపానదిపై ఉన్న కక్కి డ్యామ్‌ వద్ద వరద ఉధృతి పెరుగుతుండడంతో నీటిని కిందకు వదలాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల పంపాబేస్‌ వద్ద నది ఉప్పొంగనుంది. డ్యామ్‌ తెరిస్తే శబరి కొండకు చేరుకునే మూడు బ్రిడ్జిలు మూసుకుపోతాయి. కేరళలోని నదులపై ఉన్న 81 డ్యామ్‌లలో, 10 డ్యామ్‌లు రెడ్‌ అలర్ట్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కోటాయం జిల్లాలో వరద తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా పలు జిల్లాల మీదుగా ప్రవహించే మణిమాల నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

వరద తాకిడికి ముందకాయం గ్రామంలో ఓ రెండంతస్తుల భవనం నదిలో కొట్టుకుపోయింది. మణిమాల నది పరీవాహక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో మొత్తం 62 ఇళ్లు ధ్వంసమయ్యాయని జిల్లా అధికారులు చెప్పారు. ఈ నెల 12 నుంచి కేరళలో మొత్తం 24 చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయని, 38 మరణాలు సంభవించాయని వివరించారు.

ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పౌరీ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ముగ్గురు నేపాలీలు దుర్మరణం పాలయ్యారు. హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రిషికేష్‌లో పలు బ్రిడ్జిల వద్ద రాకపోకలను నిలిపివేశారు.

యమునోత్రి మార్గంలో ఉన్నవారిని బడ్‌కోట్‌, జానకీచట్టీ ప్రాంతాల్లో, గంగోత్రి యాత్రలో ఉన్నవారిని హర్సిల్‌, భట్వారీ, మనేరీల్లో నిలిచిపోవాలని కోరారు. బద్రీనాథ్‌ మార్గంలో ఉన్న వారు చమోలి వద్ద బస చేయాలని సూచించారు. కేదార్‌నాథ్‌ యాత్రను పూర్తిచేసుకున్న 6 వేల మందిలో 4 వేల మంది ఆదివారం సాయంత్రానికే వెనక్కి వచ్చేశారని, మిగతావారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీ నగరంలోనూ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. 

Tags:    

Similar News