మహేష్ బాబు 27 ఎవరితో..?
సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమా కోసం ముగ్గురు దర్శకులు వరుసలో ఉన్నారు. ఇప్పటివరకూ ఎవరి సినిమా ఫైనల్ కాలేదు. సరిలేరు మీకెవ్వరు సినిమా షూట్ లో బిజీగా ఉన్న మహేష్ దాని తరువాతే కొత్త సినిమా ఎవరితో అనేది ఫైనలైజ్ చేయవచ్చు.
సూపర్ స్టార్ మహేష్బాబు సరికొత్త సినిమా "సరిలేరు నీకెవ్వరు" ఇది అయన 26వ సినిమా. అనీల్ రావిపూడి దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. దాదాపు సినిమా సగానికి పైగా పూర్తయిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటినుంచే మహేష్ నటించే 27వ సినిమా మీద చర్చలు మొదలైపోయాయి. ఇంకా కనీసం స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ కాలేదు. కానీ, మహేష్బాబు తరువాతి సినిమా ఇదేనట.. దర్శకుడు వీరేనట ఇలా వార్తలు మాత్రం షికార్లు చేస్తున్నాయి.
ఇప్పటివరకూ వీటిలో ఏవీ కూడా అధికారికంగా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మహేష్ తో సినిమా చేసేందుకు ముగ్గురు నలుగురు దర్శకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. "అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా? .. 'గీత గోవిందం' ఫేం పరశురామ్... ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మహేష్ తో తదుపరి సినిమా చేసే వీలుందని వైరల్ గా ప్రచారం అవుతోంది. అయితే చివరి నిమిషం వరకూ ఏదీ కన్ఫామ్ గా చెప్పలేని పరిస్థితి. ఎవరికి వారు స్క్రిప్టులు పట్టుకుని రెడీగా ఉన్నారు. మహేష్ వాటిని విని ఫైనల్ చేసి ఖాయంగా సెట్స్ కెళుతున్నాం అని చెప్పే వరకూ అయన కొత్త సినిమా పై వచ్చే ఏవార్త కూడా కచ్చితమైనదిగా చెప్పలేం.
మరోవైపు 'మహర్షి' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన వంశీ పైడిపల్లితో మరో సినిమా చేస్తానని మహేష్ సక్సెస్ వేడుకల్లో మాటిచ్చారు. అలాగే 2020లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా చేస్తానని ప్రకటించారు. "రాజమౌళితో ప్రతిసారీ మిస్సవుతున్నా. కానీ ఈసారి మిస్సవ్వను" అని గత ఇంటర్వ్యూలో కూడా పక్కాగా చెప్పారు. ఇక రాజమౌళి- మహేష్ కాంబినేషన్ సెట్ చేసేందుకు బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా తమవంతు ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది. పరశురామ్... సందీప్ రెడ్డి వంగా ఇద్దరి వెంటా అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రి... గీతా ఆర్ట్స్ పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి ముందుగా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతానికి సూపర్ స్టార్ దృష్టి మొత్తం సెట్స్ పై ఉన్న 'సరిలేరు నీకెవ్వరు'పైనే. ఈ సినిమా పూర్తయితే కానీ ఏదీ ఖాయంగా చెప్పలేని పరిస్థితి.