Ustaad Bhagat Singh: ఓటీటీలోకి వచ్చేస్తున్న భగత్సింగ్..స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.?
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.
ఈ మూవీ ఓటీటీ విడుదల గురించి గతంలో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటికి ముగింపు పలుకుతూ నెట్ఫ్లిక్స్ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 16 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. దేవిశ్రీ ప్రసాద్, తమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీఖన్నా కీలక పాత్రల్లో కనిపించారు.
ఇంతకీ కథేంటంటే.?
కథ నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోని ఒక చిన్న గూడెంలో ప్రారంభమవుతుంది. అక్కడికి చంద్రశేఖర్ రావు అనే గురువు టీచింగ్ చెప్పడానికి వస్తాడు. గ్రామ ప్రజల జీవన పరిస్థితులు చూసి వారి కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు. పిల్లలు కూలి పనులకు వెళ్లకుండా చదువులోకి తిరిగి రావాలని ప్రోత్సహిస్తూ విద్య విలువను వారికి తెలియజేస్తాడు.
ఆ గ్రామంలో తల్లిదండ్రులు లేని చిన్న బాలుడు చిన్నయ్యను తన దగ్గరకి తీసుకుని అతనికి సంరక్షణ కల్పిస్తాడు. ఆ బాలుడిలో ఉన్న ధైర్యం, ఆవేశం చూసి అతనికి ‘భగత్ సింగ్’ అనే పేరు పెడతాడు. తన తండ్రిని అందరూ ‘ఉస్తాద్’ అని పిలిచేవారని చెప్పుకుంటూ చిన్నయ్య తనను ఉస్తాద్ భగత్ సింగ్గా పరిచయం చేసుకుంటాడు.
గురువు ముఖ్యమంత్రి… శిష్యుడు ఏసీపీ
కాలం గడిచేకొద్దీ చంద్రశేఖర్ రావు ప్రజాసేవలోకి అడుగుపెట్టి రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ప్రజల మద్దతుతో చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదుగుతాడు. అదే సమయంలో చిన్నప్పుడు పెరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ పెద్దయ్యాక పోలీస్ శాఖలో చేరి ఏసీపీగా మారతాడు. తన గురువు అయిన ముఖ్యమంత్రికి ఎప్పుడూ అండగా నిలుస్తూ భద్రతను చూసుకుంటాడు.
అయితే రాజకీయాల్లో ఎదగాలని ఆశపడే చెదలమర్రి నల్లనాగప్ప అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకోవాలని కుట్రలు పన్నుతాడు. అతనికి అసాంఘిక శక్తులతో సంబంధాలు ఉండటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది.
నల్లనాగప్పతో తలపడిన ఉస్తాద్
చంద్రశేఖర్ రావును పదవి నుంచి దించేయాలని నల్లనాగప్ప పథకాలు వేస్తాడు. ఈ సమయంలో ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ తన గురువును రక్షించడానికి ముందుకొస్తాడు. నేరస్థులపై కఠినంగా వ్యవహరిస్తూ వారి కుట్రలను ఒక్కొక్కటిగా భగ్నం చేస్తాడు.
ఈ ప్రయాణంలో అతని జీవితంలో లీల (శ్రీలీల), శ్లోక (రాశీఖన్నా) అనే ఇద్దరు మహిళలు ప్రవేశిస్తారు. వీరి పాత్రలు కథలో భావోద్వేగం, ప్రేమ, డ్రామా అంశాలను తీసుకొస్తాయి. చివరికి నల్లనాగప్ప పన్నిన కుట్రలను ఉస్తాద్ ఎలా ఎదుర్కొన్నాడు? తన గురువును ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.