మన్మధుడు సీక్వెల్ పై అధికారిక ప్రకటన

Update: 2019-03-25 08:44 GMT

గతేడాది 'దేవదాసు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున ప్రస్తుతం 'మన్మధుడు 2' సినిమాతో బిజీగా ఉన్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఈ మధ్యనే 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. 'మన్మధుడు' సినిమాకు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి 'మన్మధుడు 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ను ఇవాళ అధికారికంగా లాంచ్ చేశారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించనున్నారు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా 'ఆర్ ఎక్స్ 100' కు సంగీతం అందించిన చింతన్ భరద్వాజ్ ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించనున్నారు. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో 2002 లో విడుదలైన 'మన్మధుడు' సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వల్ కావడంతో 'మన్మధుడు 2' చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Similar News