16 ఏళ్ళ తరువాత మళ్ళీ మణిరత్నం అలా

Update: 2019-03-02 06:32 GMT

ఈ మధ్యనే 'చెక్క చివంత వానం (నవాబ్)' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ దర్శకుడు మణిరత్నం దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్మాతగా మారనున్నాడు. అది కూడా తన అసిస్టెంట్ ను దర్శకుడిగా చేసి ఆ సినిమాకు నిర్మాణ వ్యవహారాలు చేపట్టనున్నారు మణిరత్నం. దర్శకుడిగా మారబోతున్న ఆ అసిస్టెంట్ ఏ.డి. ధన శేఖర్. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాను మద్రాస్ టాకీస్ పతాకంపై దర్శకుడు మణిరత్నం నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక మల్టీ స్టారర్ సినిమా అని తెలుస్తోంది. ఇందులో విక్రమ్ ప్రభు మరియు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారట. 'ప్రేమం' సినిమాలో నాగచైతన్య తో నటించిన మడోన్నా సెబాస్టియన్ మరియు 'నవాబ్' సినిమా లో మెరిసిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ వయోలిన్ ప్లేయర్ గోవింద్ వసంత ఇప్పటికే '96' సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఆయన ఇప్పుడు మణిరత్నం సినిమాకు కూడా సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Similar News