లేడీ అమితాబ్.. 13 ఏళ్ల తరువాత మళ్లీ మేకప్!

లేడీ అమితాబ్ గా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్న విజయశాంతి తిరిగి మేకప్ వేసుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తో మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారు.

Update: 2019-08-12 09:14 GMT

తెలుగు చిత్ర సీమలో లేడీ అమితాబ్ గా ఘనమైన గుర్తింపు పొందిన విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. వెండితెరపై సాహసవంతమైన పాత్రలతో.. గ్లామరస్ లుక్స్ తో.. కోట్లాది అభిమానుల్ని సాధించుకున్న విజయశాంతి దశాబ్దానికి పైగా సినిమాలనుంచి విరామం తీసుకున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే, ఆమె రాజకీయాల్లో ప్రవేశించి అక్కడా తనదైన డైనమిజంతో ముందుకు సాగారు.

సరిగ్గా 13 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆమె తిరిగి వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించనున్నారు. కాగా, ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ లో విజయశాంతి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు సాదరంగా ఆహ్వానం పలికింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సందర్భంగా ట్విట్టర్ లో అమెకు స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు. "13 ఏళ్ల తర్వాత.. ఇది విజయశాంతి మేడమ్‌కు మేకప్‌ టైమ్‌. ఈ 13 ఏళ్ల విరామంలో ఆమెలో ఎటువంటి మార్పులేదు. అదే క్రమశిక్షణ, ప్రవర్తన, ధీరత్వం. స్వాగతం మేడమ్‌" అని అయన పోస్ట్ చేశారు.

సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా విజయశాంతికి స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు. 13 సంవత్సరాల తరువాత తిరిగి వెండితెరపై కనిపించనున్న విజయశాంతి ఎటువంటి సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి.




Tags:    

Similar News