Samantha: మనం ఎక్కడో విఫలమవుతున్నాం.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత
Actress Samantha about ragging: వ్యక్తిగత జీవితంలో సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇలా వరుస ఎదురుదెబ్బలతో ఇబ్బంది పడ్డ సమంత ప్రస్తుతం మళ్లీ కోలుకుంటున్నారు. అనారోగ్యం నుంచి నెమ్మదిగా కోలుకుంటోన్న సామ్ సినిమాల్లోనూ వేగాన్ని పెంచుతోంది. ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించిన సమంత సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, కెరీర్కు సంబంధించిన వివరాలను అభిమానులతో షేర్ చేస్తోంది.
ఇక సమాజంలో జరిగే అంశాలపై కూడా స్పందించే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ను షేర్ చేసింది. ఇటీవల కేరళలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమంత స్పందించారు. ఈ అంశం దేశవ్యాప్తంగా వైరల్గా మారిన నేపథ్యంలో సమంత ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడంపై రియాక్ట్ అయిన సామ్.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరింది.
ఈ విషయమై సామ్ పోస్ట్ చేస్తూ..'మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ స్వార్థం, ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు అర్ధాంతరంగా తన జీవితాన్ని కోల్పోయాడు. హేళనగా చూడటం, వేధింపులు, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. అయితే దీని వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని చాలామంది విద్యార్థులు మిన్నకుండిపోతున్నారు. మనం ఎక్కడో విఫలం అవుతున్నాం' అంటూ రాసుకొచ్చారు.
దీనిపై సంతాపం, పరామర్శలు తెలియజేయడమే కాదని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలన్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఆ విద్యార్థికి న్యాయం జరగాలన్న సమంత.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎదుటి వారినుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి ధైర్యంగా బయటకు మాట్లాడాలని పిలుపునిచ్చారు.