Bigg Boss Tanuja Emotional Post: నేనూ మనిషినే ..దయచేసి ఆపండి.. బిగ్ బాస్ బ్యూటీ తనూజ ఎమోషనల్ పోస్ట్
Bigg Boss Tanuja Emotional Post: బిగ్ బాస్ రియాలిటీ షో ముగిసినా, ఆ కంటెస్టెంట్ల చుట్టూ ఉండే వివాదాలు మాత్రం ముగియడం లేదు.
Bigg Boss Tanuja Emotional Post: బిగ్ బాస్ రియాలిటీ షో ముగిసినా, ఆ కంటెస్టెంట్ల చుట్టూ ఉండే వివాదాలు మాత్రం ముగియడం లేదు. ముఖ్యంగా ఈ సీజన్లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న తనూజపై నెట్టింట జరుగుతున్న సైబర్ దాడి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విమర్శలు హద్దులు దాటి, వ్యక్తిత్వ హననానికి దారితీయడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా కన్నీటి పర్యంతమైంది. తనూజను టార్గెట్ చేస్తూ వస్తున్న అసభ్యకర కామెంట్లు, నెగెటివ్ ట్రోలింగ్ ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. ఈ మానసిక హింసను భరించలేక తనూజ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తనూజ తన పోస్ట్లో నెటిజన్లను సూటిగా ప్రశ్నించింది. మీ అందరిలాగే నాకూ ఒక లైఫ్ ఉంది. నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నాను. మీరు పెట్టే చెత్త కామెంట్లను నా కుటుంబ సభ్యులు కూడా చూస్తారు, అప్పుడు వాళ్లు ఎంత బాధపడతారో ఆలోచించారా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నోటికొచ్చినట్లు మాట్లాడటం మీకు చిన్న విషయమే కావచ్చు, కానీ అది ఒక వ్యక్తిని మానసికంగా ఎంతలా కుంగదీస్తుందో ఆమె వివరించింది.
ప్రతి చిన్న విషయానికి పీఆర్ టీమ్ అంటూ నిందించడంపై తనూజ మండిపడింది. "నాకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదు. నా సోషల్ మీడియా చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నారు అంతే. అనవసరంగా నాపై విషం చిమ్మడం ఆపండి" అని స్పష్టం చేసింది. ఎవరినో టార్గెట్ చేయడానికి తాను ఇలాంటి డ్రామాలు ఆడటం లేదని, ప్రశాంతంగా, గౌరవంగా బతకాలనుకుంటున్నానని పేర్కొంది.
అవతలి వ్యక్తిపై మీకున్న ప్రేమను నేను గౌరవిస్తాను. కానీ దాని కోసం నన్ను అసభ్య పదజాలంతో దూషించడం ఏంటి? అని ప్రశ్నించింది. తన క్యారెక్టర్ను తక్కువ చేస్తూ మాట్లాడుతుంటే ఒక మహిళగా తట్టుకోలేకపోతున్నానని, ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నానని తనూజ వాపోయింది. ఈ క్రమంలో తనకు సపోర్ట్ చేసిన వారిని కూడా వదలడం లేదని ఆవేదన చెందింది.
రియాలిటీ షోలలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, విభేదాలు సహజం. షో ముగిసిన తర్వాత కూడా వాటిని మనసులో పెట్టుకుని, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని, క్యారెక్టర్ను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కుని ఇతరుల మనసులకు గాయం చేసే సంస్కృతి మారాల్సిన అవసరం ఉంది. తనూజ చేసిన ఈ భావోద్వేగపూరిత విజ్ఞప్తి చూసైనా ట్రోలర్స్ మారుతారో లేదో చూడాలి. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో బతికే హక్కు ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.