కొన్ని పాటలు వినగానే బహుశ గీత రచయిత శ్రీశ్రీ గారేమో అనుకుంటాం, అయితే అలా అనుకునే పాట....కాని వాస్తవానికి ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట....ఒకటి...అది...కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు.
పల్లవి :
కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా | | కారులో | |
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో | | నిన్నుమించిన | | | | కారులో | |
చరణం 1 :
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి
చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు
చరణం 2 :
గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు.
ఈ పాటలో ఎంతో అర్ధం వుందని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే కదా! శ్రీ.కో