పెళ్లి అంటే పందిళ్లు తప్పట్లు , తాళాలు, నగలు, దుస్తులు, పసందైన విందు, పెళ్లి మండం ఇలా ఒకటా, రెండా చాలా ఉంటాయి. పెళ్లి కుదిరిందంటే లక్షలకు లక్షలు చేతుల్లో నుంచి ఖర్చు కావాల్సిందే. ఇక ఐఏఎస్ అధికారి ఇంట్లో పెళ్లి అంటే ఆ హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఫిల్మ్ స్టార్లు ఇలా అందరూ హాజరౌతారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా భారీగానే ఉంటాయి. కానీ ఈ పెళ్లి తంతు పెళ్లీ ఖర్చు వింటే తెలిస్తే మీరు ఓ పట్టాన నమ్మరంటే నమ్మారు. ఇంతకీ ఎవరా ఐఏఎస్ అధికారి ఏంటా ఖర్చు తెలియాంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సింది.
పెళ్ళి ప్రతీ ఒక్కరి జీవితంలో మరపురాని ముఖ్య ఘట్టం. అన్ని మత సంప్రదాయాల్లోనూ పెళ్ళితంతు ఓ తీపి గుర్తు. పేద,ధనిక అనే భేదాల్లేకుండా అందరూ తమ తమ స్థాయిలకి మించి జరుపుకునే ఫంక్షన్లలో వివాహవేడుక ఒకటి. స్టేటస్ సింబల్గా మారిన షాదీతంతును ఓ ఐఏఎస్ అధికారి ఈ నెల 10వ తేదీన సింపుల్గా కేవలం 36 వేలతో జరిపించాలనుకోవడం తెలుగురాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది.
సామాన్య జనం నుండి స్టార్స్ వరకు పెళ్లిని వేడుకలా హైటెక్కు లెవెల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న తరుణంలో విశాఖకు చెందిన వూడా వీసీ బసంత్ కుమార్ తన కొడుకు పెళ్లిని సింపుల్ చేయాలని నిర్ణయించుకోవడం హాట్టాపిక్గా మారింది. సింపుల్సిటికి కేరాఫ్గా నిలిచిన ఆయన తన కొడుకు పెళ్లిని అక్షరాల 36 వేల రూపాయాలతో జరిపించాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలోను తన కూతురు పెళ్లిని అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేవలం పదహారు వేల రూపాయలతో జరిపించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
ఆడంబరాలు లేని జీవితం, పైసా లాభం లేకుండా పనిచేయడం, శుభకార్యాలను అతి తక్కువ వ్యయంతో నిర్వహించడం రాధాసోమి సత్సంగ్ నిబంధనలు. నాలుగు తరాలుగా బసంత్ కుటుంబ సభ్యులు తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. పెళ్లంటే మూడు మూళ్లు ఏడు అడుగులు రెండు జీవితాలు అని నమ్మే బసంత్ కుమార్ తన కొడుకు పెళ్లిని కేవలం 36 వేలలో చేయాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కుమార్తె తరఫువారు 18 వేలు, పెళ్లి కుమారుడి తరఫువారు 18 వేలు భరించనున్నారు.
సంత్సంగ్ సంప్రదాయ బద్ధంగానే బంధుమిత్రుల సమక్షంలోనే హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్గా చేసుకోనున్నారు. పైగా పెళ్లికి రానున్న అతిథులకు ఎటువంటి లోటూ లేకుండా బ్రహ్మాండమైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఇటు దయాల్నగర్ సత్సంగ్లో ఈ నెల 10న నూతన వధూవరుల ఆశీర్వాద కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు. రాజ్భవన్ సెక్రటరీగా 8ఏళ్లు పని చేసిన బసంత్ ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం
బసంత్ కుమార్ నిర్ణయంతో అన్నిరంగాల ప్రముఖల నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. ఎంతో మంది ఫాలో అవ్వాల్సిన విషయమని కొనియాడుతున్నారు. వివాహాలు, విందుల పేరుతో ఆర్భాటాలకు పోయి అప్పులు చేయడం కన్నా ఆచారాలను పాటిస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్న బసంత్కుమార్ నిజంగా పలువురికి రోల్మోడల్ అనే చెప్పాలి.