ఆంధ్రప్రదేశ్కు బీజేపీ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇవాళ అమిత్ షా వస్తుంటే మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయెల్, స్మృతీ ఇరానీ కూడా కొద్ది రోజుల్లో ప్రచార రంగంలోకి అడుగుపట్టబోతున్నారు. హోదా హామీ విషయంలో మాట తప్పి ప్రజాదరణ కోల్పోయిన పార్టీని తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీకి ప్రచారం చేసేందుకు అగ్రనేతల్ని బరిలోకి దింపుతున్నారు. ప్రధాని మోడీ ఇప్పటికే రెండుసార్లు ఏపీలో ప్రచారం చేయగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ నిన్న కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఇవాళ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. మొదట అమిత్ షా గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్తారు. నరసరావు పేట ఎంపీ బరిలో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తరుఫున ప్రచారం చేస్తారు. అక్కడి నుంచి విశాఖ వెళ్ళి రోడ్షోలో పాల్గొంటారు. విశాఖపట్టణం ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరితో పాటు అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు. మర్రిపాలెం, కంచరపాలెం మెట్ట ప్రాంతాలలో అమిత్ షా రోడ్ షోలు నిర్వహిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మొదటిసారిగా అమిత్ షా రాష్ట్రానికి వస్తుండగా ఆయన పర్యటనపై బీజేపీ నేతలు భార అంచనాలు పెట్టుకున్నారు.
ఏపీలో బీజేపీ ప్రచారానికి ఉగాది తర్వాత కేంద్ర మంత్రులు వస్తారని సమాచారం. స్మృతీఇ రానీ తిరుపతి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తూర్పు గోదావరి జిల్లాలో ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఇక రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఇప్పటికే విజయవాడ వచ్చి మేనిఫెస్టో విడుదల చేయగా ఆయన పర్యటన మరోసారి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముగ్గురు కేంద్ర మంత్రుల పర్యటనల తేదీలు ఇంకా ఖరారు కాలేదు.