పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. కాసేపట్లో పాక్ ఆర్మీ అధికారులు ఆయన్ను భారత్కు అప్పగించనున్నారు. భారత్లో అడుగుపెట్టిన అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు అభినందన్కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకున్నారు. జైహింద్, భారత్మాతాకి జై నినాదాలతో ఆ ప్రాంగణమంతా సందడి నెలకొంది.
వాఘా సరిహద్దుకు భారత పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ చేరుకున్నారు. వైమానికదళ అధికారులు అభినందన్కు ఘన స్వాగతం పలికారు. జయహో అభినందన్ నినాదాలతో వాఘా సరిహద్దు మార్మోగిపోయింది. పాక్ చెర నుంచి విడుదలై అభినందన్ క్షేమంగా రావడంతో జై హింద్, భారత్ మాతాకీ జై నినాదాలతో వాఘా సరిహద్దులో ఆనందోత్సాహలు వెల్లివిరిశాయి.
భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి దాయాది దేశం పాకిస్తాన్ తలొగ్గింది. తాము అరెస్ట్ చేసిన వర్ధమాన్ అభినందన్ను విడుదల చేస్తామని ప్రకటించింది. పాక్లోని బాలాకోట్లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల స్థావరంపై భారత్ మంగళవారం తెల్లవారుజామున వైమానిక దాడులు చేశారు. దీంతో పాక్ యుద్ధ విమానాలు మరుసటిరోజు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ సందర్భంగా పాక్కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమానాన్ని భారత్ నేలకూల్చగా, ఇండియాకు చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేశామనీ, వర్ధమాన్ అభినందన్ అనే పైలట్ను అరెస్ట్ చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది.
వర్ధమాన్ అరెస్టును ధ్రువీకరించిన భారత విదేశాంగ శాఖ జెనీవా నిబంధనల ప్రకారం అభినందన్ విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాలనీ, ఆయన్ను సురక్షితంగా విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. దీనికితోడు వర్ధమాన్ విడుదల విషయంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ సహా పలుదేశాలు పాక్పై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న పార్లమెంటు ఉభయసభలను సమావేశపర్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, వర్ధమాన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.