UAE: రూ.23 లక్షలకే గోల్డెన్ వీసా అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ.. అది ఫేక్న్యూస్
రూ.23 లక్షలతో యూఏఈ గోల్డెన్ వీసా దొరుకుతోందన్న వార్తలపై యూఏఈ అధికార సంస్థ ఐసీపీ స్పష్టత ఇచ్చింది.
UAE: రూ.23 లక్షలకే గోల్డెన్ వీసా అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ.. అది ఫేక్న్యూస్
రూ.23 లక్షలతో యూఏఈ గోల్డెన్ వీసా దొరుకుతోందన్న వార్తలపై యూఏఈ అధికార సంస్థ ఐసీపీ స్పష్టత ఇచ్చింది. గోల్డెన్ వీసాను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రచారం జరిగినా.. ఆ సమాచారం అసత్యమని తేల్చి చెప్పింది. గోల్డెన్ వీసా దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా అధికారిక మార్గాల్లోనే ఉండాలని, ఎవ్వరి ద్వారా అయినా పొందలేరని ఐసీపీ (ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ) స్పష్టం చేసింది.
ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఐసీపీ హెచ్చరించింది. గోల్డెన్ వీసా గురించి సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా అధికారిక వెబ్సైట్ www.icp.gov.ae లేదా 600522222 నెంబర్ను సంప్రదించాలని సూచించింది.
గత వారం భారతదేశం, బంగ్లాదేశ్ పౌరులు రూ.23 లక్షలు చెల్లించి యూఏఈ గోల్డెన్ వీసా పొందవచ్చంటూ వార్తలు వెలువడ్డాయి. ఓ ఆంగ్ల మీడియా సంస్థ పీటీఐ తెలిపిన ప్రకారం, రూ.23 లక్షల ఫీజుతో జీవితకాల గోల్డెన్ వీసా లభిస్తుందన్న సమాచారం ప్రచారంలోకి వచ్చింది. నామినేషన్ ఆధారంగా భారతీయులకు కొత్తగా ఈ అవకాశం కల్పించనున్నట్లు కథనాలు కూడా ప్రచురించబడ్డాయి. కానీ తాజాగా ఐసీపీ విడుదల చేసిన ప్రకటనతో ఈ వార్తలన్నీ అసత్యంగా తేలాయి.
ప్రస్తుతం గోల్డెన్ వీసా పొందాలంటే కనీసం 2 మిలియన్ దిర్హామ్లు విలువ చేసే స్థిరాస్తి కొనుగోలు చేయడం, లేదా వ్యాపార పెట్టుబడులు వంటి ప్రమాణాలు అవసరం. రాయద్ గ్రూప్ కన్సల్టెన్సీ అనే సంస్థ ఈ ప్రక్రియను నిర్వహిస్తుందని వచ్చిన కథనాలు కూడా నిరాధారమని స్పష్టమైంది.
గమనిక: గోల్డెన్ వీసా వంటి కీలక సమాచారం కోసం ఎల్లప్పుడూ అధికారిక మార్గాలనే అనుసరించండి.