11 మంది మృతి: 'మాకు సంబంధం లేదు'
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో గురుద్వారాలో ముష్కరులు కాల్పులు జరపడంతో 11 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో గురుద్వారాలో ముష్కరులు కాల్పులు జరపడంతో 11 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే దీనికీ తమకు ఎటువంటి సంబంధం లేదని తాలిబన్ సంస్థ ప్రకటించగా... ఇది తమ పనే అని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వార్తా సంస్థ AFP నివేదించింది. ఆలయం లోపల సుమారు 150 మంది కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి.. వారు సాధారణంగా ఉదయం ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ముష్కరులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీనిపై అఫ్గాన్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తారిక్ ఏరియన్ మాట్లాడుతూ... షోర్ బజార్లోని ధరమ్శాలలో ఆత్మాహుతి దళాలు దాడులకు తెగబడ్డాయని వెల్లడించారు.
అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. గురుద్వార లోపల చిక్కుకుపోయిన సిక్కులను భద్రతా బలగాలు ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన 15 మంది, చనిపోయిన ఒక బిడ్డను స్థానిక ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఆఫ్ఘన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాహిదుల్లా మాయర్ తెలిపారు. అఫ్గాన్లో సిక్కులపై దాడిని భారత గృహ, పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు.