Colonial History : బ్రిటన్కు చెమటలు పట్టిస్తున్న శ్రీలంక.. వందేళ్ల దోపిడీకి వడ్డీతో సహా చెల్లింపులు తప్పవా?
బ్రిటన్కు చెమటలు పట్టిస్తున్న శ్రీలంక.. వందేళ్ల దోపిడీకి వడ్డీతో సహా చెల్లింపులు తప్పవా?
Colonial History : బ్రిటిష్ పాలనలో జరిగిన దోపిడీ, అన్యాయాలపై ఇప్పుడు శ్రీలంక గట్టిగా గళం విప్పింది. వలస పాలన కాలంలో బ్రిటన్ తమ దేశానికి చేసిన ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు తమ దేశం నుంచి దొంగిలించిన అమూల్యమైన చారిత్రక సంపదను, సాంస్కృతిక వారసత్వాన్ని వెనక్కి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ పార్లమెంటులో చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.
శ్రీలంక డిమాండ్ వెనుక ఉన్న అసలు కథ
శ్రీలంక పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రి విజిత హేరత్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా దేశాలు తమను పాలించిన దేశాల నుంచి నష్టపరిహారం అడుగుతున్నప్పుడు, మనం ఎందుకు మౌనంగా ఉండాలని ఆయన ప్రశ్నించారు. దీనికి స్పందించిన ప్రభుత్వం.. కేవలం సంపదనే కాకుండా, బ్రిటిష్ సైన్యం శ్రీలంకను ఆక్రమించుకున్న సమయంలో చేసిన దాడులు, విధ్వంసాలు, మనుషుల ప్రాణాలకు కూడా పరిహారం కోరతామని వెల్లడించింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, దౌత్యపరంగా బ్రిటన్ పై ఒత్తిడి తెస్తామని ప్రభుత్వం తెలిపింది.
150 ఏళ్ల దోపిడీ.. ఏమేమి పోయాయి?
బ్రిటన్ 1796 నుంచి 1948 వరకు దాదాపు 152 ఏళ్ల పాటు శ్రీలంకను (అప్పట్లో సీలోన్) పాలించింది. ఈ కాలంలో శ్రీలంకలోని చివరి స్వతంత్ర రాజ్యమైన కాండీ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ సైన్యం హస్తగతం చేసుకుంది. ఆ సమయంలో రాజుల సింహాసనాలు, కిరీటాలు, బంగారు ఖడ్గాలు, అపారమైన నిధిని బ్రిటన్ తరలించుకుపోయింది. నేటికీ లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో 8వ శతాబ్దానికి చెందిన దేవి తార అనే అద్భుతమైన కాంస్య విగ్రహం ఉంది. నిలువెత్తు బంగారు పూతతో మెరిసిపోయే ఈ విగ్రహాన్ని తిరిగి తెచ్చుకోవడం శ్రీలంక ప్రథమ లక్ష్యంగా పెట్టుకుంది.
నెదర్లాండ్స్ నుంచి లభించిన స్ఫూర్తి
బ్రిటన్ నుంచి మొండిచేయి ఎదురవుతున్నా, శ్రీలంకకు ఇటీవల నెదర్లాండ్స్ నుంచి గొప్ప విజయం లభించింది. 2023 డిసెంబర్లో నెదర్లాండ్స్ ప్రభుత్వం సుమారు 250 ఏళ్ల క్రితం శ్రీలంక నుంచి దోచుకెళ్లిన ఆరు ప్రధాన వస్తువులను తిరిగి ఇచ్చేసింది. ఇందులో వజ్రాలు పొదిగిన బంగారు ఖడ్గం, పురాతన తుపాకులు, చారిత్రక లెవ్కే ఫిరంగి ఉన్నాయి. ఈ విజయం ఇచ్చిన ఊపుతో ఇప్పుడు శ్రీలంక తన దృష్టిని బ్రిటన్ వైపు మళ్లించింది. విండ్సర్ క్యాజిల్, బ్రిటిష్ మ్యూజియంలో బందీలుగా ఉన్న తమ వారసత్వ వస్తువులను విడిపించుకోవాలని లంక సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది.
ముందున్న సవాళ్లు ఏంటి?
అయితే ఈ పోరాటం అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా వరకు పురాతన వస్తువులు విదేశాల్లోని ప్రైవేట్ వ్యక్తుల వద్ద, వేలంలో అమ్ముడుపోయిన కలెక్షన్లలో ఉన్నాయి. వారిపై ఒత్తిడి తేవడం అంతర్జాతీయ చట్టాల పరంగా క్లిష్టమైన ప్రక్రియ. మరోవైపు, శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఈ సెంటిమెంట్ కార్డును వాడుతోందని కొందరు విమర్శిస్తున్నారు. కారణం ఏదైనా, వలస పాలన కాలం నాటి లెక్కలు తేల్చాలన్న శ్రీలంక నిర్ణయం మాత్రం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.