Beggars Mafia : కోట్లలో టెండర్లు..విమానాల్లో ప్రయాణాలు..పాక్ ఖజానాను నింపుతున్న బిచ్చగాళ్లు
కోట్లలో టెండర్లు..విమానాల్లో ప్రయాణాలు..పాక్ ఖజానాను నింపుతున్న బిచ్చగాళ్లు
Beggars Mafia : పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ ఇప్పుడు ఆ దేశం ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య బిచ్చగాళ్ల మాఫియా. పాకిస్థాన్లో భిక్షాటన అనేది ఇప్పుడు ఒక వ్యవస్థీకృత నేరంగా మారిపోయింది. దీని వెనుక ఏకంగా కోట్లాది రూపాయల దందా నడుస్తోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ మాఫియా దెబ్బకు సౌదీ అరేబియా, యూఏఈ వంటి అరబ్ దేశాలు పాకిస్థాన్ వీసాలపై ఆంక్షలు విధిస్తుండటం గమనార్హం.
ఎలా ఆపరేట్ అవుతుంది ఈ బిచ్చగాళ్ల మాఫియా?
రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్లో భిక్షాటన అనేది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. ముఖ్యంగా సియాల్కోట్ ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు మొదట దక్షిణ పాకిస్థాన్లోని పేద ప్రజలను టార్గెట్ చేస్తారు. వారికి ఉపాధి కల్పిస్తామని నమ్మించి లేదా భిక్షాటన ద్వారా వచ్చే లాభాల్లో వాటా ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ తర్వాత వారి పేరు మీద పాస్పోర్టులు, వీసాలు తీయించి విమానాల్లో గల్ఫ్ దేశాలకు పంపిస్తారు.
విదేశాలకు వెళ్లిన ఈ బిచ్చగాళ్లను అక్కడ కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసిన హోటళ్లలో ఉంచుతారు. రంజాన్ వంటి పవిత్ర మాసాల్లో వీరిని మసీదులు, బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనకు దింపుతారు. అక్కడి కరెన్సీలో వీరు సంపాదించే లక్షలాది రూపాయలను హవాలా మార్గాల ద్వారా తిరిగి పాకిస్థాన్కు తరలిస్తారు. భిక్షగాళ్లకు వారి కష్టానికి తగ్గట్టుగా కొద్దిపాటి జీతం లేదా కమీషన్ ఇచ్చి కాంట్రాక్టర్లు కోట్లు గడిస్తున్నారు.
అధికారుల అండదండలు..
ఈ నెక్సస్ కేవలం కాంట్రాక్టర్లతోనే ఆగలేదు. ఎయిర్పోర్టుల్లో ఉండే ఇమ్మిగ్రేషన్ అధికారులు, కస్టమ్స్ అధికారులు కూడా ఈ మాఫియాలో భాగస్వాములేనని మంత్రి ఆరోపించారు. వీరికి భారీగా ముడుపులు అందజేసి, ఎక్కడా తనిఖీలు లేకుండా భిక్షగాళ్లను విదేశాలకు పంపిస్తున్నారు. ఒకవేళ విదేశాల్లో ఎవరైనా బిచ్చగాడు పోలీసులకు చిక్కితే, వారిని విడిపించేందుకు కూడా కాంట్రాక్టర్లు తమ పలుకుబడిని ఉపయోగిస్తుంటారు. పాకిస్థాన్ జనాభాలో దాదాపు 20 శాతం మంది భిక్షాటనపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ఆ దేశంలో ఇది అతిపెద్ద ఉపాధి మార్గంగా మారిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
అరబ్ దేశాల ఆగ్రహం.. దేశ పరువుకు ముప్పు
పాకిస్థాన్ బిచ్చగాళ్ల బెడద భరించలేక గల్ఫ్ దేశాలు ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. గతేడాది వేల సంఖ్యలో పాకిస్థానీలను అరబ్ దేశాలు డిపోర్ట్ (తిరిగి వెనక్కి పంపడం) చేశాయి. దీనివల్ల నిజమైన పర్యాటకులు, ఉద్యోగాల కోసం వెళ్లే వారికి వీసాలు రావడం గగనమైపోతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు ఈ మాఫియా లిస్టులను సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈ కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. భిక్షాటన ద్వారా దేశ పరువును విదేశాల్లో తాకట్టు పెడుతున్న ఈ వ్యవస్థను కూల్చివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.