ఇరాన్లో కరోనావైరస్ మహమ్మారికి 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియానౌష్ జహన్పూర్ ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో కొత్తగా 106 కేసులు నమోదయ్యాయని.. దాంతో మొత్తం కేసుల సంఖ్య 245 కు పెరిగిందని - ఫిబ్రవరి 19 న ఇరాన్ మొదటి అంటువ్యాధులను ప్రకటించినప్పటి నుండి ఒకే రోజు ఇది అత్యధిక సంఖ్య అని తెలిపారు. చైనా వెలుపల కరోనా వైరస్ ద్వారా మరణించిన వారు ఎక్కువగా ఉన్న దేశం ఇదే.. కాగా కరోనావైరస్ బాధితులలో ఇరాన్ ఉపాధ్యక్షురాలు కూడా చేరిపోయారు. ఇరాన్ ఏడుగురు ఉపాధ్యక్షులలో మహిళల వ్యవహారాలను పర్యవేక్షించే మసౌమెహ్ ఎబ్టెకర్ ఇందులో ఉన్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు.
ఎబ్తేకర్కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరి రక్త నమునాలను సేకరించి ల్యాబ్ కు పంపారు. రిపోర్టులు ఈరోజు వచ్చే అవకాశం ఉందని ఎబ్తేకర్ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ఉపాధ్యక్షురాలే కాదు ఆ దేశ పార్లమెంటు జాతీయ భద్రత మరియు విదేశీ వ్యవహారాల కమిటీ అధిపతి మొజ్తాబా జోల్నూర్ కూడా వైరస్ బారిన పడ్డారు. అతను స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఫార్స్ వార్తా సంస్థ పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది.
ఇదిలావుంటే ఎబ్టెకర్ కు కోవిడ్-19 సోకిందనే వార్త బయటికి రావడానికి ఒకరోజు ముందు ఆమె ప్రభుత్వ కేబినెట్ మీటింగ్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ మీటింగ్లో దేశాధ్యక్షుడు హసన్ రౌహానీకి చాలా దగ్గరగా ఆమె కూర్చున్నారు. దీంతో రౌహానీ ఆరోగ్యంపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు మీడియా నివేదికల ప్రకారం, గురువారం ఇరాన్ లోని కోమ్లో మరణించిన వారిలో ప్రముఖ వేదాంతవేత్త హదీ క్రోరోషాహి కూడా ఉన్నారు, ఆయన 1981 లో వాటికన్ సిటీలో ఇరాన్ మొదటి రాయబారిగా పనిచేశారు. ఆయన మరణం పలువురిని షాక్ కు గురిచేసింది.