చైనా ఐస్క్రీంలో కరోనా ఆనవాళ్లు.. కలకలం రేపుతున్న చైనా తాజా ప్రకటన
*వైరస్ ఆనవాళ్లపై రోజుకో ప్రకటన చేస్తోన్న చైనా *ఇప్పటి వరకు 390 కార్టన్ల ఐస్క్రీమ్ విక్రయం
కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లైన చైనా.. వైరస్ ఆనవాళ్లపై రోజుకో ప్రకటన చేస్తోంది. తాజాగా అక్కడ తయారైన ఐస్క్రీంలోనూ కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించింది. గతకొద్ది రోజులుగా చైనాలో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోన్న వేళ, చైనా తాజా ప్రకటన కలకలంరేపుతోంది.బీజింగ్కు సమీపంలోని తియాన్జిన్ ప్రాంతంలోని ఓ ఫుడ్ కంపెనీ తయారుచేసిన ఐస్క్రీంలో కరోనా ఆనవాళ్లు కనిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ బ్యాచ్లో ఉత్పత్తి అయిన వేల కార్టన్లను సదరు సంస్థ వెనక్కి తీసుకుంటోంది. ఈ బ్యాచ్లో ఇప్పటివరకు 390 కార్టన్లను మాత్రమే విక్రయించారని, మరో 29వేల కార్టన్న ఐస్క్రీంలను ఇంకా విక్రయించలేదని చైనా అధికారులు స్పష్టంచేశారు. ఈ అమ్మకాలు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఈ ఐస్క్రీం తయారీకి న్యూజిలాండ్, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న పిండి పదార్థాలను వాడినట్లు చైనా వెల్లడించింది. ఈ ఐస్క్రీంల వల్ల ఎవరైనా వ్యక్తులు వైరస్ బారినపడ్డారా? లేదా? అనే విషయం తెలియదని అధికారులు తెలిపారు. దీంతో సంస్థను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు, ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆహార పదార్థాలతో కరోనా వైరస్ వ్యాపించడం తక్కువేనని ప్రపంచఆరోగ్య సంస్థతో పాటు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ విదేశాల నుంచి వచ్చే ఆహార ఉత్పత్తుల్లో కరోనా వైరస్ వెలుగుచూస్తున్నట్లు చైనా గత కొంతకాలంగా ప్రకటిస్తోంది. విదేశాలనుంచి ప్రయాణికులు తీసుకొచ్చే ఆహారపదార్థాలతోనే వైరస్ వస్తున్నట్లు ఆరోపిస్తోంది. అయితే, ఈ విషయంలో చైనా తీరుపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.