Earthquake: నేపాల్లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రత
Nepal Earthquake: నేపాల్ను మరోసారి భూకంపం వణికించింది. శుక్రవారం తెల్లవారుజామున 1.33 గంటలకు భూమి కంపించింది.
Earthquake: నేపాల్లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రత
Nepal Earthquake: నేపాల్ను మరోసారి భూకంపం వణికించింది. శుక్రవారం తెల్లవారుజామున 1.33 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
దీనికి రెండు రోజుల ముందు, పశ్చిమ నేపాల్లోని కాస్కి జిల్లాలో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప కేంద్రం ఖాట్మండు నుండి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సినువా ప్రాంతంగా గుర్తించారు. ఇది మధ్యాహ్నం 1.59 గంటలకు సంభవించింది.
ఇదిలా ఉంటే, మే 14న తూర్పు నేపాల్లోని సోలుఖుంబు జిల్లాలో 4.6 తీవ్రతతో భూకంపం జరిగింది. ఛెస్కం ప్రాంతం కేంద్రంగా భూకంపం నమోదు కాగా, మే 15న కూడా అక్కడే ప్రకంపనలు నమోదయ్యాయి.
భూకంప నిపుణుల ప్రకారం, లోతైన భూకంపాల కంటే ఉపరితలానికి దగ్గరగా వచ్చే నిస్సార భూకంపాలు మరింత ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ఎందుకంటే అవి భూమి ఉపరితలానికి సమీపంలో శక్తిని విడుదల చేస్తాయి. దీనివల్ల భూమి తీవ్రంగా కంపిస్తుంది. గోడలు, భవనాలు పాడవ్వడం, ప్రాణ నష్టం చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాగా, లోతైన భూకంపాలు ఉపరితలానికి చేరుకునే సమయానికి వారి శక్తి కొంత మేర తగ్గిపోతుంది.
నేపాల్ భూకంపాలకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పేరుపొందింది. ఇక్కడ భారత-యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొంటూ ఉంటాయి. ఈ ప్రక్రియలో తీవ్రమైన ఒత్తిడి, పీడనం ఏర్పడి, భూకంపాలుగా వెలువడుతుంటుంది. నేపాల్ సబ్డక్షన్ జోన్లో ఉండటంతో భారత ప్లేట్ యురేషియన్ ప్లేట్ కిందకి జారిపోతుంది. ఈ ప్రక్రియ వలన భూమిలో గట్టి ఒత్తిడి ఏర్పడి, తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.