అతివేగంతో బైక్ ప్రమాదం.. ఇద్దరి మృతి

Update: 2019-06-10 14:18 GMT

పోరు పెట్టి కొన్న కొత్త బైక్ ముచ్చట ఆ యువకుడికి తీరనేలేదు.. కొనిచ్చిన తల్లి, కొడుకు కళ్ళలో ఆనందనాన్నిపూర్తిగా ఆస్వాదించనే లేదు.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. అతనితో పాటు అతని స్నేహితుడూ మరణించాడు. హైదరాబాద్.. ఉప్పల్ దగ్గరలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీసులు తెలిపిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. సరూర్‌నగర్‌లోని భగత్‌సింగ్‌నగర్‌లో ఉండే గాదె సంజయ్‌ (20), ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌కు చెందిన జగదీప్‌ (19) స్నేహితులు. సంజయ్‌ ఐటీఐ చేస్తున్నాడు. జగదీప్‌ ఇంటర్‌ పరీక్షలు రాసి ఫెయిల్‌ అయ్యాడు. శనివారం అర్ధరాత్రి ఇద్దరూ ద్విచక్ర వాహనంపై ఎల్బీనగర్‌ నుంచి ఉప్పల్‌ వైపు బయలుదేరారు. సంజయ్‌ నడుపుతుండగా జగదీప్‌ వెనుక కూర్చున్నాడు. వాహనాన్ని వేగంగా నడుపుతూ ఉప్పల్‌లోని మెట్రో రైలుస్టేషన్‌ ప్రాంతానికి వచ్చి పిల్లర్‌ 817ను ఢీకొట్టి కింద పడిపోయారు. సంజయ్‌ అక్కడికక్కడే మృతిచెందగా జగదీప్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని గాంధీ ఆస్పత్రికి, అక్కడి నుంచి యశోదాకు, ఆ తర్వాత నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం జగదీప్‌ మృతిచెందాడు. సంజయ్‌ తండ్రి దుర్గయ్య ఇటీవలే మృతి చెందారు. తనకు ద్విచక్ర వాహనం కావాలని తల్లితో గొడవపడి, తీవ్రమైన ఒత్తిడి చేసి ఎట్టకేలకు బైకు కొనిపించుకున్నాడు సంజయ్‌. శనివారానికి బైక్‌ కొని మూడురోజులే అయింది. అంతలోనే ప్రమాదం సంభవించింది. 


Tags:    

Similar News