క్రికెట్‌ బెట్టింగ్‌కు మరో విద్యార్థి బలి

Update: 2019-08-08 06:50 GMT

క్రికెట్‌ బెట్టింగ్‌కు మరో విద్యార్థి బలయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన.. హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లో జరిగింది. బెట్టింగ్‌ మాఫియా బెదిరింపులకు తాళలేక.. డిగ్రీ చదువుతున్న విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఉరేసుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లికి చెందిన వీ. విష్ణుమూర్తి.. భార్య వినోద, కుమార్తె, కుమారుడు రవికుమార్ (21)తో కలిసి 25 ఏండ్ల కిందట హైదరాబాద్‌లోని బోరబండ సమీప హెచ్‌ఎఫ్‌నగర్ ఫేజ్-1లో నివసిస్తున్నారు.

రవికుమార్ కూకట్‌పల్లిలోని ప్రతిభ డిగ్రీ కాలేజీలో బీస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే విద్యార్థులే లక్ష్యంగా ఇదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్ క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రవికుమార్ కూడా ఇతడి వలలో చిక్కి రూ.40 వేలవరకు బెట్టింగ్ డబ్బు బాకీపడ్డాడు. అయితే రాజశేఖర్ తీవ్రఒత్తిడి తేవడంతో తన తండ్రికి అబద్ధం చెప్పి డబ్బు అడిగాడు. విష్ణుమూర్తి స్వగ్రామంలో పొలం అమ్మి రూ. 40వేలను రవికుమార్‌కి ఇచ్చాడు. అయినా ఇంకా మరో 40 వేలు బాకీ ఉన్నావని రాజశేఖర్ బెదిరించాడు. ఇలా రోజూ వేధింపులకు గురిచేస్తుండంతో వేధింపులకు తట్టుకోలేక ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని రవికుమార్ అత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.

Tags:    

Similar News