గ్రీన్ గోల్డ్ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ పాత నేరస్తుడన్న రాచకొండ సీపీ గతంలోనూ వివిధ స్కీమ్స్ పేరుతో మోసాలకు పాల్పడ్డాడని తెలిపారు. పరారీలో ఉన్న మరో ఆరుగురిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
పల్లీ నూనె స్కామ్లో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వేరుశెనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలను ఇస్తామని నమ్మించి వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలుచేసి మోసానికి పాల్పడ్డ గ్రీన్ బయోటెక్ యజమాని శ్రీకాంత్తోపాటు మరో ఇద్దరు నిందితులు భాస్కర్ యాదవ్, లలితప్రియను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు.
లక్ష పెట్టుబడి పెడితే నెలకు పది వేలు ఆదాయం వస్తుందని నమ్మించి సుమారు వంద కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడినట్లు రాచకొండ సీపీ తెలిపారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో 2000 సంవత్సరం నుంచే శ్రీకాంత్ మోసాలకు పాల్పడుతున్నాడని, ఇతనిపై గతంలో ఎన్నో కేసులు ఉన్నాయన్నారు. గ్రీన్ గోల్డ్ పేరుతో ఇప్పుడు మోసానికి పాల్పడ్డ శ్రీకాంత్ ఇంతకుముందు మహా గోల్డ్ పేరుతో జనాన్ని ముంచేశాడని చెప్పారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారన్న రాచకొండ సీపీ వీళ్లను పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.