కర్నూలు జిల్లాలో విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Update: 2019-03-20 06:25 GMT

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నందికొట్కూరు పట్టణం బుడగజంగం కాలనీకి చెందిన వీరాంజనేయులు ఆయన భార్య వసంత ఇద్దరు పిల్లలు రామలక్ష్మి, రాజేష్ తో కలిసి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. గ్యాస్ స్టౌలు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రామాంజనేయులు ఇతరుల దగ్గర డబ్బులు అప్పులు తీసుకుని వేరేవాళ్లకు అప్పులు ఇస్తుండే వాడు. అయితే రామాంజనేయులు దగ్గర అప్పులు తీసుకున్న వారు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆర్ధిక సమస్యలు తలెత్తాయి. ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలకు ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

నలుగురు కుటుంబ సభ్యులు చనిపోవడం నందికొట్కూరులో తీవ్రకలకలం రేపింది. దారుణ ఘటనపట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విగత జీవులుగా పడి ఉన్న కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యకు దారితీసిన పరిస్తితులపై ఆరా తీశారు. కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా హత్యచేశారా? లేదా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.  

Similar News