తనకన్నా తన భార్య ఎక్కువ సంపాదన ఆర్జించడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. దీంతో.. ఏదో ఒక కారణంతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే టార్చర్ తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలను కూడా భర్త తనకు కాకుండా చేశాడు. దీంతో.. తట్టుకోలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే...విశాఖ 3వ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ చినవాల్తేరు కిర్లంపూడి ప్రిన్స్ అపార్టుమెంట్లో పీతల అప్పారావు నివాసముంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు రెండో కుమార్తె వాణి (35)ని జడ్పీ సమీపంలోని కృష్ణానగర్కు చెందిన పసుపులేటి గంగాధర్కు ఇచ్చి 2011లో వివాహం చేశారు.
ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. వాణికి రూ.7.8 లక్షలు జీతం కాగా గంగాధర్ జీతం రూ.నాలుగు లక్షలు. దీంతో భర్త గంగాధర్లో అసూయ బాగా పెరిగిపోయింది. అమెరికాలో ఉండగానే వాణికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఇంకా కట్నం, కానుకలు తేవాలని సూటిపోటి మాటలతో వేధించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేయాలని కూడా ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ ఈ ఏడాది ఏప్రిల్ 29న విశాఖ వచ్చేశారు. వాణి ఇంటి నుంచే హోం టు వర్క్ ఉద్యోగం చేస్తున్నారు. భర్త మాత్రం బంధువుతో కలసి మెడికల్ బిజినెస్ ప్రారంభించారు. ఈ క్రమంలో అత్తింటి వేధింపులు భరించలేక వాణి తన ఇద్దరు కుమారులను తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. ఆమె తల్లిదండ్రులు చినవాల్తేరు దరి కిర్లంపూడి లేఅవుట్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇదిలాఉండగా గంగాధర్ పిల్లలను తన వద్దకు రప్పించుకున్నాడు. ఆ సమయంలో వాణి.. తాను కూడా వస్తానని అతనితో చెప్పగా, పిల్లల్ని మాత్రమే తీసుకురమ్మన్నాడని చెప్పడంతో ఆమె ఉండిపోయింది. బుధవారం ఎప్పటిలాగే నిద్రపోయింది. ఉదయం బయటకు రాకపోవడంతో అనుమానంతో తలుపులు బద్ధలు కొట్టిచూసేసరికి వాణి అచేతనం గా ఉంది. గంగాధర్ వేధింపుల వల్లే వాణి ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరి సుహాసిని ఆరోపించారు. ఎస్ఐ ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.