చ‌నిపోయిన కొడుకు వీర్యంతో ఆ త‌ల్లి ఏం చేసిందంటే

Update: 2018-02-15 08:36 GMT

అమ్మ ప్రేమకు అవధులు లేవనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి నిజం చేసింది.  చనిపోయిన కొడుకు వీర్యంతో పండంటి మనుమలను పొందింది ఆ తల్లి. కొడుకు మీదున్న ప్రేమ.. తన కళ్ల ముందు లేడన్న బాధతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయిన తన కొడుకు మధుర స్మృతులను ఎలాగైనా గుర్తుంచుకోవాలన్న ఆశతో.. పెళ్లి కాని తన కొడుకు వీర్యాన్ని తీయించి భద్రపరిచి.. ఇప్పుడిలా అతడి వారసులను తన చేతుల్లోకి తీసుకుంది. ఈ ఆసక్తికర పరిణామం పుణెలో జరిగింది. ప్రథమేశ్ (27) ఉద్యోగ రీత్యా జర్మనీలో ఉండేవాడు. అయితే, 2013లో అతడికి ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. కీమోథెరపీ చేస్తే సంతాన లేమి సమస్యలు తలెత్తే ప్రమాదముందని గ్రహించిన వైద్యులు.. అతడి అనుమతితో వీర్యాన్ని తీసుకుని భద్రపరిచారు. అదే ఏడాది సెప్టెంబరులో అతడికి కీమోథెరపీని ప్రారంభించారు వైద్యులు. అయితే, 2016 సెప్టెంబరులో కీమోథెరపీ తీసుకుంటూనే పుణెలో మరణించాడు ప్రథమేశ్. అతడి మరణంతో కలత చెందిన అతడి తల్లిదండ్రులు.. జర్మనీలో భద్రపరిచిన వీర్యాన్ని తీసుకుని.. ఇప్పుడు పండంటి మగ కవలలను అతడికి గుర్తుగా పొందారు అతడి తల్లిదండ్రులు. దీనిపై స్పందించారు అతడి తల్లి రాజశ్రీ పాటిల్. 

చదువులో అతడు చాలా దిట్ట అని, అలాంటి తన కొడుకుకు బ్రెయిన్ కేన్సర్ అని తెలిసి కుమిలిపోయామని, కీమోథెరపీ తీసుకునేటప్పుడు అతడి చూపు కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది రాజశ్రీ. చూపు పోయినా అతడిలో ఆత్మస్థైర్యం మాత్రం చావలేదని, చివరి శ్వాస వరకూ తమనెప్పుడూ నవ్విస్తూ ఉండేవాడని చెప్పారు. కీమోథెరపీ ప్రారంభానికి ముందు భద్రపరిచిన అతడి వీర్యం ద్వారా మనుమలను పొందాలని నిశ్చయించుకున్నామని చెప్పారామె. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి జర్మనీ నుంచి వీర్యాన్ని తీసుకొచ్చి.. ఐవీఎఫ్ కోసం పుణె-అహ్మద్‌నగర్ రోడ్‌లోని సహ్యాద్రి ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు.

తల్లే.. కొడుకు పిల్లలను మోయాలనుకున్నవేళ..
ప్రథమేశ్ వీర్యం సేకరించాక.. అండదాతల కోసం వెదికారు ఆస్పత్రి వైద్యులు. వారి రంగు, ముఖ చిత్రాలకు సరిపోలే మహిళ అండాన్ని సేకరించి అతడి వీర్యం ద్వారా నాలుగు పిండాలను సృష్టించారు. ఆ పిండాలను మోసేందుకు అతడి తల్లి రాజశ్రీనే సిద్ధమయ్యారు. కానీ, ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అది కుదరదని వైద్యులు తేల్చారు. దీంతో అతడి చిన్నమ్మ (తల్లి కజిన్) ఆ పిల్లలను తన కడుపులో మోసేందుకు అంగీకరించారు. సోమవారం ఉదయం ఇద్దరు పండంటి కవలల పిల్లలకు జన్మనిచ్చింది. 
 

Similar News