తల్లి తన బిడ్డల బాగుకోరుతుంది. కానీ ఈ కొడుకు తల్లి చావు కోరాడు. కర్రతో కొట్టి, గొంతు నులిమి అత్యంత దారుణంగా చంపేశాడు. పేగు తెంచుకుపుట్టిన కొడుకే తన ప్రాణాలు తీస్తాడని ఆ తల్లి ఊహించలేదు.. బుధవారం హైదరాబాద్ లోని ఎల్లారెడ్డి గూడలో కన్న తల్లిని కొడుకే హత్య చేసిన సంఘటన సంచలనం రేపింది. చిట్టీల పేరుతో తల్లి మమత అప్పులు మిగిలించిందన్న కారణంగా ఆమెను తీవ్రంగా కొట్టి హతమార్చాడు కొడుకు మదన్. అయితే ఈ హత్యలో ఆమె భర్త హస్తం కూడా ఉన్నట్టు మమత తండ్రి చెబుతున్నారు..
అప్పులకు అమ్మేకారణమని మదన్ తరచూ గొడవపడేవాడు. దీంతో 15 రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా కొత్తపేటలోని తన అన్న రమేష్ ఇంటికి వెళ్లింది మమత. బుధవారం రాత్రి మమతను ఆమె ఇంటి దగ్గర వదిలివెళ్లాడు రమేష్. మమత వచ్చీరాగానే భర్త శ్రీనివాస్, కొడుకు మదన్ గొడవకు దిగారు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఆమెను హత్యచేశాడు మదన్. అయితే తండ్రీకొడుకులు కలిసే మమతను చంపేశారని ఆమె తండ్రి రాములు యాదవ్ ఆరోపిస్తున్నాడు. భర్త శ్రీనివాస్ మాత్రం తప్పంతా మమతదే అంటున్నాడు. తమ ఇంటి నుంచి డబ్బు, బంగారం పుట్టింటికి తీసుకెళ్లేదని... అందుకే మదన్... తల్లిని మర్డర్ చేశాడని శ్రీనివాస్ చెప్తున్నాడు.