ఎంతపని చేశావమ్మా...

Update: 2018-06-07 07:14 GMT

కన్నబిడ్డలిద్దరితో సహా ఓ తల్లి కదులుతున్న రైల్లోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదఘటన బుధవారం విశాఖపట్నంలోని గోపాలపట్నం సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం వెంకంపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, ఇందుమతి దంపతులు తమ సంతానం జ్యోత్స్న (6), బద్రీనాథ్‌ (5)తో కలిసి  ఏడాది కిందటే వడ్లపూడి దరి కణితి ఆర్‌హెచ్‌ కాలనీకి వలస వచ్చారు. చంద్రశేఖర్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, ఇందుమతి స్థానికంగా టైలరింగ్‌ దుకాణంలో పని చేస్తున్నారు. మొదటి నుంచీ తన పిల్లల్ని బాగా చదివించాలనే తపనతో ఉన్న ఇందుమతి ప్రైవేటు పాఠశాలలో చేర్పించాలని భర్తతో చెబుతుండేది. దానికి తమ ఆర్థిక స్తోమతు సరిపోదని అతను వారించేవాడు. ఇది ఇద్దరి మధ్య గొడవలకు దారి తీసింది. దీనిపై తరచూ వివాదాలు జరుగుతుండేవి. ఇటీవలే ఇందుమతి స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో పిల్లలకు సంబంధించిన ధ్రువపత్రాలు అందజేయడంతో... మంగళవారం భార్యభర్తలిద్దరూ మళ్లీ గొడవ పడ్డారు. చివరకు ఆమె బలవన్మరణానికి తెగించింది. ఈ క్రమంలో భర్తతో గొడవపడిన ఇందుమతి తీవ్ర మనస్తాపానికి గురైంది. చావు ఒక్కటే పరిష్కారమని భావించిన ఇందుమతి.. తన పిల్లలతో బుధవారం దువ్వాడ రైల్వేస్టేషన్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు ఎక్కింది. గోపాలపట్నం సమీపంలో కదులుతున్న రైల్లో నుంచి పిల్లలతో సహా దూకేసింది. ఈ ఘటనలో తల్లి ఇందుమతి, కుమారుడు బద్రీనాథ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె జ్యోత్స్నకు తీవ్రగాయాలయ్యాయి. బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News