వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్పష్టం చేశారు. 430 మండలాల్లో ప్రచారం చేస్తానని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పానని తెలిపారు. తనను కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటివరకు చెప్పలేదని విజయశాంతి వ్యాఖ్యానించారు. కేటీఆర్, కవిత రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉంటాననే భయంతోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్కు పార్టీలను ఒప్పించలేని కేసీఆర్.. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చానని అనడం హ్యాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ అహంకారపు మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సోనియా కాళ్ల మీద పడి పార్టీని కలిపేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని విమర్శించారు. టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ను అధికారంలోకి తేవడమే తన లక్ష్యం అని విజయశాంతి తెలిపారు.