ఇటీవల ప్రకటించిన నీట్-2018 లో కొందరు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దాంతో క్షణికావేశంతో ఆత్మహత్యకు యత్నిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన జస్లిన్ కౌర్ అనే యువతి నీట్ లో ఫెయిల్ అయిందని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యపై సోషల్ మీడియా వేదికగా ప్రముఖ నటుడు, నడిగర్ సంగం ప్రధాన కార్యదర్శి విశాల్ స్పందించాడు. నీట్ లో ఫెయిల్ అయ్యామని ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు మీకు సాయం చెయ్యడానికి నేనున్నా అంటూ విశాల్ వారికీ దైర్యం చెప్పారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విశాల్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశాడు.
దాని సారాంశం ఇలా ఉంది.. 'హైదరాబాద్కు చెందిన జస్లిన్ కౌర్ అనే యువతి నీట్ పరీక్షలో విఫలమై ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. ఆ యువతి వార్త నన్ను కలచివేసింది. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమైనట్లే నీట్ పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. ఓడిపోయాం కదా అని ఆశలు వదులుకోవద్దు. మీకు సాయం చేయడానికి నేనున్నాను. నీట్ ఒక్కటే శాశ్వత పరీక్ష అయితే..విద్యార్థులకు బాగా చదవడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించాలి. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కానీ విద్యార్థులు ఇలా ప్రాణాలు తీసుకుంటూపోతే వారి కలలు కలలుగానే మిగిలిపోతాయి. కోచింగ్, సైకలాజికల్ శిక్షణ వంటివి ఏర్పాటుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. లేకపోతే పేద విద్యార్థులు వైద్య విద్య గురించి ఇక ఆలోచించలేరు' అని విశాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు.