కళా వెంకట్రావు మా ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువ

Update: 2018-02-17 10:01 GMT

త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరుపున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నిలబెడుతున్నామని ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శనివారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తమ పార్టీకి 44 మంది ఎమ్మెల్యేల మెజార్టీ ఉందని, తమ అభ్యర్థి గెలవడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అప్పుడే ప్రలోభాలు మొదలు పెట్టిందని ఆయన మండిపడ్డారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు తమ ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువని... ఆయన ఆ స్థాయికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. హవాలా ద్వారా డబ్బులు చేకూర్చే పనిలో యరపతినేని శ్రీనివాసరావు ఉన్నారని ఆరోపించారు.

మంత్రి అచ్చెన్నాయుడు ఓ విలువలు లేని వ్యక్తి అని విజయసాయి విమర్శించారు. పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో స్పీకర్ కోడెల రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర, అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ హాస్టల్స్ ను మూసివేసి... నారాయణ విద్యాసంస్థలకు లాభం చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు.

Similar News