మోడీ ప్రభుత్వం తమ ప్రభుత్వ చివరి పూర్తిస్థాయి బడ్జెట్ను రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. అందులోనూ జీఎస్టీ శకం ప్రారంభమయ్యాక తొలి బడ్జెట్ కావడంతో పన్నుల మోతలు, ధరల వాతలు ఎలా ఉండబోతాయోననే చర్చ సర్వత్రా సాగుతోంది.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తమ ప్రభుత్వ చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. స్వాతంత్ర్య భారతదేశంలో ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 88 బడ్జెట్లు ఒకటైతే.. ఈ బడ్జెట్ మరో ఎత్తు. దేశచరిత్రలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెబుతున్న జీఎస్టీ అమల్లోకి వచ్చాక ప్రవేశపెడుతున్న మొట్టమొదటి బడ్జెట్ కావడంతో కొత్త పన్నుల విధానం బడ్జెట్ మౌలిక స్వరూప స్వభావాలను ఏ మేరకు ప్రభావితం చేసిందో స్పష్టం కానుంది.
సాధారణంగా, కేంద్ర బడ్జెట్లో రెండు భాగాలుంటాయి. రంగాలవారీగా వివిధ పథకాలకు కేటాయింపుల వివరాలను పొందుపరచేది మొదటిది. ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన మార్పులూ చేర్పులు ఉండేది రెండోది. అయితే కొత్తగా వచ్చిన జీఎస్టీ కారణంగా బడ్జెట్ లో వ్యాట్, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సేవాసుంకాల వంటి డజనుకుపైగా పరోక్ష పన్నుల ఊసే లేకుండా చేయనుంది.
కొన్నేళ్లుగా విద్య, కృషి కల్యాణ్, స్వచ్ఛభారత్, శుద్ధ ఇంధనం తదితరాల పేరిట రకరకాల సెస్సుల వడ్డన ‘బడ్జెట్ సంప్రదాయం’గా స్థిరపడింది. అటువంటి ఇరవైరకాల సెస్సులూ జీఎస్టీ పద్దులో చేర్చడంతో బడ్జెట్ ప్రసంగంలో కీలకమైన మార్పు కనిపించనుంది. వేర్వేరు పద్దుల కింద లెక్కలు చదవకుండా సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా పన్నుల విధానం ఉండనుంది.