రిజర్వేషన్లపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. రిజర్వేషన్లను అన్ని రాష్ట్రాల్లో తీసేయాలన్న ముత్తిరెడ్డి కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చదువుల్లో రిజర్వేషన్లు తీసేయాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. చదువులో రిజర్వేషన్ల వల్ల చాలా మంది పిల్లలు బాధపడుతున్నారనీ, వెనుకబడిపోతున్నారని వ్యాఖ్యానించారు ముత్తిరెడ్డి. దీంతో ఆందోళనలు మిన్నంటాయి.
రిజర్వేషన్ల బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు ముత్తిరెడ్డి. ఆ బాధ తాను స్వయంగా అనుభవించానని కూడా చెప్పారు. 90 మార్కులు వచ్చిన వారికి సీటు దొరకదు 40 మార్కులు వచ్చిన వారికి డాక్టర్ సీట్లు ఎలా వస్తాయని జనగామ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లడారు. రిజర్వేషన్లను అన్ని రాష్ట్రాల్లో తీసేయాలని కామెంట్ చేశారు. ఇది జెన్యూన్ డిమాండ్ కాబట్టి ఎలాంటి సెషన్స్ లేకుండ సభ ఆమోదించాలన్నారాయన.
రిజర్వేషన్లపై తన వ్యాఖ్యలతో ఆందోళన మిన్నంటడంతో ముత్తిరెడ్డి మాట మార్చారు. తాను రిజర్వేషన్లు గురించి మాట్లాడలేదని, తొలగించాలని చెప్పలేదని సమర్థించుకున్నారు. అసలు రిజర్వేషన్ల రద్దు గురించి తానేమీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. మెడికల్ సీటు వచ్చి డబ్బులు లేని దళిత విద్యార్థి సురేందర్ను తాను మెడిసిన్ చదివించానన్నారు. దీనిపై ఎవరి మనసైన నొచ్చుకుంటే, మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని ముత్తిరెడ్డి కోరారు.