టీఆర్ఎస్ లోనూ రెడ్లదే ఆధిపత్యం

Update: 2018-11-15 06:26 GMT

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 117 నియోజకవర్గాలకు పోటీ పడే అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి, రెడ్డి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటివరకూ ప్రకటించిన సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24 సీట్లు దక్కగా, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, సిక్కులకు ఒకటి దక్కాయి. టిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటి వరకు 2 విడతలుగా 117 మంది అభ్యర్ధుల పేర్లను వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్ధులను సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే, రెడ్లకు 37, వెలమలకు 12, మున్నూరు కాపులకు 8, గౌడలకు 6, యాదవులకు 5 సీట్లు లభించాయి.

టిఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్ధుల్లో మాదిగలకు 11, మాలలకు 7, లంబాడాలకు 7, కోయలకు 4, ముస్లింలకు 3, కమ్మ వర్గానికి 6, బ్రాహ్మణ, వైశ్య, ఠాకూర్, ముదిరాజ్, పద్మశాలీ, విశ్వ బ్రాహ్మణ, పెరిక, వంజర, నేతకాని, సిక్కులకు ఒక్కొక్కటి చొప్పున సీట్లు లభించాయి. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే 29 మంది రెడ్డి సామాజిక వర్గం అభ్యర్ధులకు సీట్లు కేటాయించింది. తుది జాబితాలో కూడా మరికొంత మంది రెడ్డి వర్గీయులకు సీట్లు కేటాయించనుంది. కాంగ్రెస్‌ ప్రకటించిన రెడ్డి సామాజిక వర్గ అభ్యర్ధులను ధీటుగా ఎదుర్కోవాలంటే తన పార్టీ నుంచి కూడా వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన గులాబీ బాస్ ఏకంగా 37 మంది రెడ్లను బరిలో దించారు.
 

Similar News