ఇక ప్రభుత్వ కళాశాలలో
మధ్యాహ్నం భోజనం వంతట,
ఈ విద్యా సంవత్సరంలో,
పెడతారట తెలంగాణ అంతట,
కాస్త కయ్యం లేని బియ్యం పెట్టండయ్యా. శ్రీ.కో
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక భాగస్వామ్యంతో పాఠశాలల్లో అమలు చేస్తుండగా, ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్ర నిధులతో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ, డీఈడీ కళాశాలల్లో, ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్ విద్యార్థులకు శ్రీకారం చుట్టనున్నారు. దీనివల్ల మొత్తం అయిదు లక్షల మందికి లబ్ధి చేకూరనుందని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్న ప్రతిపాదన రెండేళ్లుగా ఉంది. పథకం అమలుపై శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఈటల రాజేందర్, హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి శనివారం సచివాలయంలో సమావేశమై చర్చించారు.