దెయ్యం అంటే భయం లేనిది ఎవరికి..? దేవుడంటే ఎంత భయమో..దెయ్యం అంటే కూడా మనం అలాగే వణుకుతాం. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఈ భయాలు సామాన్యులకే కాదు...ఉన్నత స్థాయిలో ఉన్నవారికి కూడా ఉంటాయి. సెంటిమెంట్లు, దైవ భీతి, దెయ్యం భయం మన దేశంలో ఏ స్థాయిలో ఉన్నాయో రెండు రాష్ట్రాల్లో జరిగిన ఘటనలే ఉదాహరణ.
ఆయన నిన్న మొన్నటి వరకు ఓ రాష్ట్ర మంత్రి. రాజకీయ కారణాల వల్ల పదవి ఊడాక..పెద్దగా పని లేకుండా పోయింది. పైగా ఆయన కుటుంబానికి పలు కేసుల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుడడంతో చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆ తాజా మాజీగారు, ప్రస్తుత ఎమ్మెల్యే..ఏకంగా సీఎం , డిప్యూటీ సీఎం మీద విచిత్ర ఆరోపణలు చేశారు. ఈ వింత గాథ ఏంటో మీరే చూడండి.
లాలూ కొడుక్కి దయ్యం భయం..దయ్యం దెబ్బకు ప్రభుత్వ భవంతి ఖాళీ చేసినన తేజ్ ప్రతాప్ యాదవ్..అవును మీరు విన్నది నిజమే. లాలూ కొడుకు బిహార్ మాజీ మంత్రి తేజ్ప్రతాప్ యాదవ్ దయ్యం భయంతో ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేశారు. పైగా ఈ విషయాన్ని ఆయనే బహిరంగంగా ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్నా..తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే ఆయన చేసిన ఆరోపణలు ఎంతో వింతగానూ, మరింత విచిత్రంగానూ ఉన్నాయి మరి.
ఇంతకీ తేజ్ప్రతాప్ యాదవ్ చేసిన ఆరోపణ ఏంటంటే తను ఉంటున్న బంగ్లాలో దయ్యాల్ని వదిలింది బీహార్ సీఎం నితీశ్ కుమార్తో పాటు, బీజేపీ నేత బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ అట. వారు వదిలిన దెయ్యాలు తేజ్ప్రతాప్ యాదవ్ ను తెగ వేధించాయట. ఆ దెయ్యాల బాధ భరించలేకే తాను ప్రభుత్వం బంగ్లా ఖాళీ చేసినట్లు తేజ్ప్రతాప్ ఆరోపించారు. ఈ యువ నేత మాటలు విని అందరూ ముక్కున వేలేసుకున్నారు.
నిజానికి తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కోసం పాట్నా దేశ్రత్న్ మార్గ్లోని ప్రభుత్వ భవనాన్ని కేటాయించారు. మొదట్నుంచి వాస్తు, మతపరమైన విషయాలపై నమ్మకం ఉన్న తేజ్ ప్రతాప్ ఆ బంగ్లాను తన సెంటిమెంట్గా భావించారు. అప్పట్లో ఈ బంగ్లా మెయిన్ ఎంట్రన్స్ మూసేసి, కొన్ని మార్పులు కూడా చేయించారు. మంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలని తేజ్ ప్రతాప్కు నితీశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో తేజ్ ప్రతాప్ పట్నా హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ప్రభుత్వ నోటీసులపై స్టే విధించింది. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉండగానే దెయ్యాలు ఉన్నాయంటూ తేజ్ప్రతాప్ బంగ్లా ఖాళీ చేసేశారు. తన బంగ్లాలో దెయ్యాన్ని వదిలారంటూ...నితీశ్ మీద సుశీల్ మోడీ మీద తేజ్ప్రతాప్ యాదవ్ చేయడం జిమ్మిక్కని జేడీయూ, బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే లోలోపల మాత్రం కాగల కార్యం దెయ్యాలే తీర్చాయని సంబరపడుతున్నారు.