కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెదేపా ఎంపీలు దిల్లీలో గళమెత్తారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పార్లమెంటుకు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేతబట్టి ‘మాకు న్యాయం చేయండి.. ప్రధాని దీనిపై స్పందించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో తోట నరసింహం, టీజీ వెంకటేశ్, శివప్రసాద్, రామ్మోహన్నాయుడు, నిమ్మల కిష్టప్ప, గల్లా జయదేవ్ సహా తెదేపా ఎంపీలందరూ పాల్గొన్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లో అరకొర నిధులతో అభివృద్ధి సాధ్యపడదని.. అందుచేత కేంద్రం విరివిగా నిధులిచ్చి ఆదుకోవాలని ఎంపీలు కోరారు. విభజన హామీలు నెరవేర్చకపోతారా అని చూస్తుంటే.. నాలుగేళ్లుగా నిరాశే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.