టీటీడీపీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులతో నేతల్ని కోల్పోయిన టీడీపీ ఇప్పుడు నియోజకవర్గ ఇంచార్జ్ లను కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ మాలోతు రాందాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
కొద్దికాలం క్రితం టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డితో రాందాస్ నాయక్ సంత్సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పార్టీ మారడంతో భవితవ్యంపై మధనపడ్డ రాందాస్ నాయక్ తనకున్న సత్సంబంధాలతో హైదరాబాద్లో రేవంత్రెడ్డిని కలిశారని విశ్వసనీయవర్గాల సమాచారం. అంతేకాదు రేవంత్ రెడ్డి సూచనతో జిల్లాకు చెందిన పోట్ల నాగేశ్వరరావుతో కలిసి గురువారంరాత్రి ఢిల్లీకి వెళ్లి రేణుకాచౌదరి ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీని కలిసేందుకు వెళ్ళారని తెలిసింది. కాంగ్రెస్లో తనకు భవిష్యత్ కల్పిస్తారనే భరోసాను రేవంత్రెడ్డి, రేణుకాచౌదరి, పోట్లపై ఉంచుతున్నారని వినికిడి. గురువారం రేవంత్రెడ్డినుంచి పిలుపురావటంతో రాందాస్నాయక్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఈ విషయమై రాందాస్నాయక్ ను ప్రశ్నించడగా కాంగ్రెస్లో చేరికపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలేదన్నారు. అయితే, రాందాస్ వ్యవహారాన్ని టీడీపీ జిల్లా నాయకత్వం ఇప్పటికే పసిగట్టినట్లు సమాచారం.