యుక్తవయసు వచ్చిన వారు పెళ్లితో పనిలేకుండా నచ్చిన వారితో కలిసి జీవించవచ్చని సోమవారం భారతీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. పెళ్లి చేసుకోకుండానే ఆడ మగ కలిసి జీవించవచ్చని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి కేసు ఆధారంగా ఈ తీర్పు వెలువరించింది సుప్రీం కోర్ట్. కేరళకు చెందిన నందకుమార్ అనే వ్యక్తి తుషార్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లినాటికి నందకుమార్ వయసు 20 ఏళ్ళు తుషార్ వయసు 18 ఏళ్ళు . హిందూ వివాహ చట్టం ప్రకారం యువతీకి(18) యువకుడికి(21) ఏళ్ళు ఉండాలి కానీ నందకుమార్ వయసు 20 సంవత్సరాలే ఉండటంతో వారి వివాహం చెల్లదని కేరళ హైకోర్ట్ తీర్పు చెప్పింది.ఈ తీర్పును సవాల్ చేస్తూ నందకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై జస్టిస్ ఏ కే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. వాదోపవాదాలు విన్న అనంతరం తీర్పు వెలువరించిన సుప్రీం యుక్తవయసు దాటినా ఆడ మగ వారికీ నచ్చిన వారితో కలిసి జీవిచే స్వేచ్ఛ ఉందని తెలిపింది. పైగా దీనికి వివాహం అవసరం లేదని వెల్లడించింది.