కాసేపట్లో తేలనున్న యడ్యూరప్ప భవితవ్యం.. గవర్నర్ కు వ్యతిరేకంగా తాజామాజీ బీజేపీనేత!
కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్ప భవితవ్యం కాసేపట్లో తేలనుంది. మెజార్టీ మార్కు లేకుండానే గవర్నర్ యడ్యూరప్పను సీఎం చేయడంపై దాఖలైన పిటిషన్పై ధర్మాసనం తుది తీర్పు వెలువరించనుంది. కర్ణాటక బీజేపీ సర్కారు విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? బల నిరూపణకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును కోర్టు తగ్గిస్తుందా..? సుప్రీంకోర్టుకు యడ్యూరప్ప ఇచ్చే ఎమ్మెల్యేల జాబితాలో కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ఇదే సమయంలో బీజేపీ నేత(తాజామాజీ) , సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ వ్యక్తిగతంగా దాఖలు చేసిన పిటిషన్ను కూడా సుప్రీం ధర్మాసనం ముందుకు రాబోతోంది. కర్ణాటక గవర్నర్ తనకు సంక్రమించిన రాజ్యాంగాధికారాలను దుర్వినియోగపర్చారంటూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. అలాగే ఈ నెల 15, 16 తేదిల్లో గవర్నర్కు యడ్యూరప్ప సమర్పించిన లేఖలను తమకు సమర్పించాలని ఆదేశించిన నేపధ్యంలో .. సర్వోన్నత న్యాయంస్థానం నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ అందరిలోనూ పెరిగింది. అయితే కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. కోర్టు తీర్పు యడ్యూరప్పలో టెన్షన్ పుట్టిస్తుండగా... .కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తుందని కోటి ఆశలు పెట్టుకుంది.