ఏదీ నాటి లగ్జరీ లైఫ్‌... కష్టాల్లో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్‌

Update: 2018-05-07 05:15 GMT


లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న సాఫ్ట్ వేర్ రంగంలో పరిస్ధితులు తలకిందులవుతున్నాయి. ఒకప్పుడు ప్రాజెక్టు  పూర్తయితే శాలరీలు హైక్ చేసే  కంపెనీలు ... ఏడాదికో  పెంచేందుకు కూడా తటాపటాయిస్తున్నాయి.  ప్రముఖ కంపెనీలు సైతం ఐదారు శాతానికి మించి పెంచేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో సాప్ట్‌వేర్ ఎంప్లాయిస్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో బెంచ్‌లపై వందలాది మంది కూర్చొబెట్టిన సంస్ధలు ఇప్పుడు ఉన్న ఉద్యోగులను తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ ఏడాది ఐటీ ఉద్యోగులకు తీవ్ర నిరాశే మిగిలింది. ప్రాజెక్టుల్లో జోరు పెరగడంతో జీతాల పెంపు భారీగా ఉంటుందని భావించిన ఉద్యోగులకు కార్పోరేట్ కంపెనీలు ఊహించని షాకిచ్చాయి. ప్రముఖ సంస్ధలు రెండు నుంచి ఆరు శాతానికి వేతనాల పెంపును పరిమితం చేయగా..  ఇతర సంస్ధలు ఇంత వరకు ఆ ప్రయత్నం కడా చేయడం లేదు.  ఇక  ఫ్రెషర్స్‌కు పదేళ్ల క్రితం నాటి  ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎక్స్‌పీరియన్స్ కోసమే ఉద్యోగం చేయాల్సి వస్తోందంటూ టెకీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తాజా పరిణామాలపై ఉద్యోగులు బహిరంగగానే విమర్శలు చేస్తున్నారు. యాజమాన్యాల తీరును నిరసిస్తూ సోషల్ మీడియా ద్వారా తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.  

భారత సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు కీలక మార్కెట్లయిన అమెరికా, యూరప్‌ దేశాల్లో చోటుచేసుకున్న విధానపరమైన మార్పులే ఇందుకు ప్రధాన కారణమని ఫోరమ్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ అంటోంది. ట్రంప్‌ సర్కారు విధానాలు, బ్రెగ్జిట్‌ పరిణామాల ఫలితంగానే జీతాలు సింగిల్‌ డిజిట్‌కు పరిమితమయ్యాయంటూ సమర్ధించుకుంటున్నారు.  !సాధారణంగానే ప్రతి 8-10 ఏళ్లకోసారి ఐటి ఇండస్ట్రీ ఆర్థిక ఒత్తిడికి లోనవుతూ వస్తోంది. 2008-09లో అమెరికా ఆర్థిక మాద్యం తర్వాత మళ్లీ ఇప్పుడదే పరిస్థితులు పునరావృతమవుతున్నాయంటున్నారు.   

గతంలో అవసరానికి మించి ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే సంస్ధలు ఇప్పుడు ఉన్నవారిని తగ్గించుకునే పనిలో పడ్డాయి. హై శాలరీ ఉన్న వారితో పాటు నైపుణ్యం తక్కువగా ఉన్న వారిని సాగనంపేందుకు సిద్ధమయ్యాయి.    దీంతో ఐటీ కొలువు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని చందంగా మారిందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News