కేంద్రంపై తెదేపా, వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. సభ సజావుగా సాగనందువల్లే నోటీసులు తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. సభ నిర్వహణ సక్రమంగా సాగకపోతే నోటీసులు స్వీకరించలేమన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే తెరాస, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడంతో సభ 12 గంటలకు వాయిదా పడింది. గంట తర్వాత సభ ప్రారంభమయ్యాకా అదే పరిస్థితి నెలకొంది. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల పెంపు అంశంపై తెరాస సభ్యులు స్పీకర్ వెల్లోకి ప్రవేశించి నినాదాలు చేశారు. వారి ఆందోళన మధ్యే స్పీకర్ కాసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అయినా వారు బిగ్గరగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు సభ్యులు వీలు కల్పించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.