రైస్ పుల్లింగ్... అసలు అదేంటో తెలియాని వారిని సైతం మాటల్లోపెట్టి నిండా ముంచుతున్నారు మాయాగాళ్లు. డబ్బుపై ఆశపడుతున్న వారినే టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఓ రాగి చెంబు, పాతిక బియ్యం. ఇవి ఉంటే చాలు. ఓ పిట్టకథ అల్లి చివరికి నిండా ముంచి డబ్బును దండుకుంటున్నారు కేటుగాళ్లు. తాజాగా అమాయక ప్రజలను మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముటాకు చెక్ పెట్టారు హైదరాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులు.
ముఢనమ్మకానికి పోయి జేబులు గుల్లచేసుకుంటున్నారు కొంత మంది అమాయకులు. సరిగ్గా అలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని కొన్నిగ్యాంగ్ లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇలాంటి ముఠాల్లో ప్రధానమైనది రైస్ పుల్లింగ్. ఆర్థిక లావాదేవీలు పెద్ద మొత్తంలో చేసి, చివరికి ఇతర కారణాల వల్ల లాస్ అయిన వారిని రైస్ పుల్లింగ్ పేరుతో సులభంగా మోసం చేస్తున్నారు. సరిగ్గా ఈలాంటి ఓ ముఠా సభ్యులను కటకటాలవైపు నెట్టారు హైదరాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులు.
చేతిలో ఓ ఇత్తడి చెంబు.... ఆ చెంబులో ఓ అయస్కాంతం. ఇనుప రేణువులతో కలిసిన ఓ పాతిక బియ్యం గింజలు. అమాయకులను మోసం చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. చెంబులో మహిమలున్నాయంటూ జనాలను నమ్మిస్తున్నారు. అంజనేయులు, పజల్, బబ్లు, బాబురావు ఓ ముఠాగా ఏర్పడ్డారు. గత కొంతకాలంగా రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. బోయిన్పల్లి పీఎస్ పరిధిలో కొందరిని డీఆర్డీవో ఉద్యోగులుగా పరిచయం చేసుకుని.. తమ దగ్గర శక్తులు కలిగిన చెంబులు ఉన్నాయని నమ్మించారు. కొందరి దగ్గర అక్షరాలా 25 లక్షలు స్వాహా చేశారు.
అంతటితో ఆగారా... అంటే లేదు. మహాంకాళి పీఎస్ పరిధిలో కూడా రైస్ పుల్లింగ్ పేరుతో కొందరి నుంచి 33 లక్షల రూపాయలు దండుకుని పారిపోయారు. ఇక ఈ ముఠాలో బాబురావు వరంగల్ ఎన్ఐటీలో ఎంటెక్ చేశాడు. ఈ క్రమంలో ముఠా సభ్యులపై వివిధ పీఎస్ లలో ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు నలుగురిని అరెస్ట్ చేశారు. 34 లక్షల నగదు, ఇన్నావో కారు, చెంబులు, సెల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రైస్ పుల్లింగ్ పేరుతో డబ్బులను రెండింతలు, పదింతలు చేస్తామని చెప్తున్న వారి మాటలు నమ్మవద్దని, అలాంటి వారి గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.