కోళ్ల పరిశ్రమకు కరెంటు షాక్ ...

Update: 2018-03-29 05:38 GMT

ఎండలు దంచి కొడుతున్న వేళ పౌల్ట్రీ పరిశ్రమకు పవర్ షాక్ తగిలింది. ఒక్కసారిగా ధరలను పెంచాలని విద్యుత్ సంస్ధలు నిర్ణయించడంతో మూలిగే నక్కపై తాటి కాయ చందంగా పరిస్ధితి మారింది. సీజన్ వచ్చిందని ఆనందపడాలో నిర్వాహణ వ్యయం పెరుగుతోందని బాధపడాలో తెలియక యజమానులు తలలు పట్టుకుంటున్నారు.   

ఆరోగ్యం కోసం రోజుకో గుడ్డు తింటున్నా రా ?  అయితే మీ జేబు కాస్తా బలంగా ఉంచుకోండి ఎందుకంటారా ? రాబోయే రోజుల్లో గుడ్డు ధర కొండెక్కనుంది. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులకు విద్యుత్ చార్జీలు కూడా తోడు కావడంతో ధరలు పెంచక తప్పే పరిస్ధితులు కనిపించడం లేదు. 

 దేశంలో కోడి గుడ్లను అత్యధికంగా ఉత్పత్తి  చేసే రాష్ట్రాల్లో  ఏపీ, తెలంగాణ అగ్రస్ధానంలో ఉండగా ఇందులో మెజార్టీ షేర్ హైదరాబాద్ దే. ఇక చికెన్, గుడ్ల వినియోగంలో కూడా రెండు రాష్ట్రాలు ఇదే వరుసలో నిలుస్తున్నాయి. అయితే వరుసగా పెరుగుతున్న నిర్వాహణ, ఉత్పత్తి వ్యయ్యాలు పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర ప్రతిబంధకంగా మారుతున్నాయి. తాజాగా వచ్చే నెల ఒకటవ తేది నుంచి విద్యుత్ చార్జీలను 50 శాతం వరకు పెంచడంతో గుడ్డు, చికెన్ ధరలు పది శాతానికి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రెండు నెలల క్రితం నాలుగు రూపాయలుగా ఉన్న గుడ్డు ధర ఇప్పుడు ఐదు రూపాయలకు చేరుకుంది. తాజా లెక్కలతో ఏప్రిల్ మొదట్లో 5 రూపాయల 50 పైసలు, చివరి నాటికి 6 రూపాయలకు చేరే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దాణా ధరలు కూడా పెరగడంతో ధరలు పెంచకతప్పడం లేదంటున్నారు. 

గతంలో ప్రభుత్వం విద్యుత్ పై సబ్సిడీ అందిస్తూ ఉండటం వల్ల పరిశ్రమల యజమానులకు కొద్దిలో కొద్దిగా ఊరట ఉండేది. అయితే ఒక్కసారిగా యూనిట్ కు రెండు రూపాయల మేర ధరలు పెంచితే ఎలాగని పౌల్ట్రీ యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇతర సమయాలతో పోల్చుకుంటే వేసవి కాలం పౌల్ట్రీ పరిశ్రమలకు ప్రతికూలంగా ఉంటుందని ఇలాంటి సమయంలో ధరల పెంపు సరికాదంటున్నారు. ఈ విషయంలో వేలాది కార్మికులు, లక్షలాది కుటుంబాలను దృష్టిలో ఉంచుకోని  సబ్సిడీలపై  ఓ నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై సర్కార్ దృష్టిపెడితే సరే లేదంటే చికెన్ తినాలనుకునే వినియోగదారుడి కరెంట్ షాక్ తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Similar News