పార్లమెంట్లో ప్రధాని మోడీ చెలరేగిపోయారు. దేశంలో ఇన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సే అంటూ ఆ పార్టీని తూర్పారపట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ... కాంగ్రెస్కు ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. తెలుగువారిని తీవ్రంగా అవమానించింది కాంగ్రెస్సే అంటూ దుయ్యాబట్టారు. ఆ అవమానాల నుంచే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి జీవం పోశారని పార్లమెంట్లో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తిగా అప్రజాస్వామికంగా జరిగిందన్నారు మోడీ. చట్టసభ తలుపులు మూసేసి ఏపీని విభజించారన్నారు. వాజ్పేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత తలెత్తని ఇబ్బందులు ఏపీ విషయంలో కాంగ్రెస్ పాలన లోపం వల్లే తలెత్తుతున్నాయని విమర్శించారు. ఏపీ విభజన ఆద్యంతం విధి విధానాలు పాటించకుండా జరిగిందని దుయ్యబట్టారు. ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ తీరు వల్లే రాష్ట్రానికి ఇప్పుడు సమస్యలు వచ్చాయని, రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా కాంగ్రెస్ మోసం చేసిందని మోదీ మండిపడ్డారు.