ఈ ఏడాది నుంచే 84 చోట్ల జూనియర్ కాలేజీలను ప్రారంభిస్తున్నామని విద్యాశాఖ మంత్రి కడియంశ్రీహరి అన్నారు. ఉపాధ్యాయుల బదిలీల వెబ్సైట్ను ప్రారంభించిన కడియం... 84 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. విద్యార్థులు శారీరక, మానసిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని.. అన్ని హాస్టళ్లలో ఒకే రకమైన మెనూను అమలు చేస్తున్నామన్నారు. అంతే కాక 7వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆరోగ్య కిట్లు అందిస్తామన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఉపాద్యాయ బదిలీ దరఖాస్తుల కోసం ఆన్లైన్ సర్వీస్ను మంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ప్రారంభించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఉపాధ్యాయుల బదిలీలను పూర్తిగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నారు.
ఆన్లైన్లో దరఖాస్తు ఇలా..
ముందుగా http://transfers.cdse.telangana.gov.in వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. అనంతరం వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. తర్వాత మెనుబార్లో ఉండే SERVICE అనే కేటగిరీని క్లిక్ చేయాలి. తర్వాత Teachers Transfer ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం NEW ENTRY ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్, ట్రెజరీ ఐడీ, ఆధార్ నెంబర్ ఇచ్చి SUBMIT బటన్ను క్లిక్ చేయాలి. వెంటనే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేయాలి.
అప్పుడు అప్లికేషన్ ఫాం మీకు ఓపెన్ అవుతుంది. ఫాం నింపిన తర్వాత ప్రివ్యూ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఒకసారి అన్ని డిటేయిల్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, ఏవైనా కరెక్షన్స్ ఉంటే ప్రివ్యూలో చేసుకోవాలి. తర్వాత SUBMIT బటన్ను క్లిక్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫాం నింపే ప్రాసెస్ పూర్తవుతుంది.